దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక అడ్వెంచర్ డ్రామా ‘వారణాసి’ (Varanasi) గురించి ఆసక్తికరమైన విషయాలను తాజాగా వెల్లడించారు. ఓ వెబ్ పోర్టల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన, ఈ సినిమా కథ వారణాసిలో ప్రారంభమై అంటార్కిటికా, ఆఫ్రికా, పురాతన రోమ్ వంటి విభిన్న ప్రాంతాల మీదుగా ప్రయాణించి చివరికి మళ్లీ వారణాసిలోనే ముగుస్తుందని తెలిపారు.
రాజమౌళి మాట్లాడుతూ, ‘ఆర్ఆర్ఆర్’ పూర్తయిన 2022 నుంచి దాదాపు నాలుగున్నర సంవత్సరాలుగా ఈ కథపై పని చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం సినిమా షూటింగ్లో 80 శాతం పూర్తైందని, భారీ యాక్షన్ ఎపిసోడ్ల చిత్రీకరణ ముగిసిందని, ఇక కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉన్నాయని వెల్లడించారు.
అలాగే, పూర్తి స్థాయిలో ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరిస్తున్న తొలి నాన్-ఇంగ్లీష్ సినిమా ‘వారణాసి’ ఇదేనని రాజమౌళి పేర్కొన్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో షూటింగ్ కొనసాగుతుండగా, దసరా నాటికి చిత్రీకరణ పూర్తిచేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ చిత్రాన్ని కె.ఎల్. నారాయణ నిర్మిస్తున్నారు. యాక్షన్, అడ్వెంచర్, పౌరాణిక అంశాల సమ్మేళనంగా రూపొందుతున్న ఈ సినిమాకు ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా 2027 ఏప్రిల్ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.






