నటి రష్మిక మందన్న (Rashmika Mandanna) ఇటీవల సినిమా షూటింగ్ సందర్భంగా జరిగిన ప్రమాదంపై తొలిసారి స్పందించారు. ‘మైసా’ సినిమా చిత్రీకరణలో కీలక సన్నివేశం చేస్తున్న సమయంలో ఆమెకు గాయమైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత సోషల్ మీడియా వేదికగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు ఆమె స్పష్టత ఇచ్చారు.
తాజా పోస్టులో రష్మిక మాట్లాడుతూ, అనుకోకుండా జరిగిన ఈ ప్రమాదం తనకు కొంత నొప్పిని కలిగించినప్పటికీ, ధైర్యంగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. ప్రస్తుతం సానుకూల దృక్పథంతో విశ్రాంతి తీసుకుంటూ ఆరోగ్యంపై పూర్తి దృష్టి పెట్టినట్లు వెల్లడించారు.
అలాగే, తన ఆరోగ్యం గురించి ఆందోళన వ్యక్తం చేసిన అభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులందరికీ ఆమె ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం తన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలోనే పూర్తిగా కోలుకుని మళ్లీ షూటింగ్లలో పాల్గొంటానని ఆశాభావం వ్యక్తం చేశారు.
రష్మిక పోస్ట్ వైరల్ కావడంతో అభిమానులు ఊరట వ్యక్తం చేస్తున్నారు. ఆమె త్వరగా కోలుకుని మళ్లీ వెండితెరపై సందడి చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.






