Rashmika Mandanna: రష్మిక ప్రధాన పాత్రలో ఎం.ఎస్. సుబ్బలక్ష్మి బయోపిక్.. కమల్ హాసన్ అతిథి!

భారతీయ సంగీత ప్రపంచంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ గాయని ఎం.ఎస్. సుబ్బలక్ష్మి. ఆమె జీవిత కథ ఆధారంగా ఓ సినిమా తెరకెక్కబోతుందనే వార్తలు కొంతకాలంగా సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ బయోపిక్‌లో తొలుత నేచురల్ బ్యూటీ సాయి పల్లవి నటించనున్నారనే ప్రచారం జరిగింది.

అయితే ఆ తర్వాత ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా Rashmika Mandanna ప్రధాన పాత్రలో కనిపించనున్నారని వార్తలు వచ్చాయి. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడటంతో ఈ వార్తలకు తెరపడింది.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి 110వ జయంతిని పురస్కరించుకుని సెప్టెంబర్ 16న చెన్నైలో ఈ బయోపిక్‌ను గ్రాండ్‌గా లాంచ్ చేయనున్నట్లు సమాచారం. ఈ ప్రత్యేక కార్యక్రమానికి యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. అంతేకాకుండా భారతీయ సంగీత రంగానికి చెందిన పలువురు ప్రముఖ గాయనీ గాయకులు కూడా ఈ వేడుకలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రతిష్టాత్మక చిత్రానికి “జెర్సీ” ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించనున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇక అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించనున్నాడు.

ఎం.ఎస్. సుబ్బలక్ష్మి వంటి దిగ్గజ గాయని జీవితాన్ని తెరపై ఆవిష్కరించబోతుండటంతో ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. రష్మికకు ఇది మరో ఛాలెంజింగ్ పాత్రగా నిలిచే అవకాశం ఉండటంతో ఈ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.