రష్మిక మందన్న ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘మైసా’ (MYSAA) నుంచి మేకర్స్ కీలక అప్డేట్ ఇచ్చారు. దర్శకుడు రవీంద్ర పుల్లే రూపొందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ను తాజాగా ఓ పవర్ఫుల్ పోస్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించారు.
తాజాగా విడుదల చేసిన పోస్టర్లో రష్మిక లుక్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చీరకట్టులో కనిపిస్తున్న ఆమె చేతికి విరిగిన సంకెళ్లు ఉండగా, మరో చేతిలో ఈటె పట్టుకుని యుద్ధభూమిలో నిలబడి కనిపించారు. ఒంటిపై గాయాలు ఉన్నప్పటికీ, ఆమె కళ్లలో కనిపిస్తున్న ఆగ్రహం, తెగువ పాత్ర ఎంత ఇంటెన్స్గా ఉండబోతుందో చూపిస్తోంది. ఈ పోస్టర్తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
ఇక ‘మైసా’ షూటింగ్ సమయంలో రష్మిక మందన్న హిప్ ఇంజురీకి గురైన విషయం తెలిసిందే. గాయం తీవ్రంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమె కొన్ని వారాల పాటు షూటింగ్కు దూరంగా ఉండి విశ్రాంతి తీసుకున్నారు. ప్రస్తుతం ఆమె గాయం నుంచి కోలుకోవడంతో తిరిగి షూటింగ్లో పాల్గొనేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
అన్ ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్పై అజయ్ సాయిపురెడ్డి, అనిల్ సయ్యపురెడ్డి, వీరసాయి గోప సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీకాంత్ రెడ్డి సాథి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందిస్తున్నారు.
‘మైసా’ను తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో రూపొందిస్తున్నారు. తాజాగా ప్రకటించిన వివరాల ప్రకారం ఈ చిత్రం 2026 నవంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.

ఇదిలా ఉంటే, ‘మైసా’ ఆడియో హక్కులను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ సొంతం చేసుకోగా, డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్ఫ్లిక్స్ దక్కించుకుంది. రష్మిక ఇంటెన్స్ లుక్, ఆసక్తికరమైన కథాంశం, భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు






