మూడో భార్యను చంపిన రెండో భార్య…సహకరించిన మొదటి భార్య పిల్లలు !

woman Killed Her Husbands 3rd Wife

తన భర్త తనను పట్టించుకోవడం లేదన్న ఆక్రోశంతో అతడి మూడో భార్యను హత్య చేసింది రెండో భార్య. ఈ హత్యకు భర్త మొదటి భార్య కుమార్తెలు, వారిలో ఒకరి కుమార్తె బాయ్‌ఫ్రెండ్ ఆమెకు సహకరించడం సంచలనంగా మారింది. పోలీసుల కథనం ప్రకారం మహారాష్ట్రలోని నల్లసొపారాలో మిశ్రా అనే వ్యక్తి లేబర్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. 2017లో పార్వతి మనె అనే యువతిని రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పటికే అతడికి పెళ్లయి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. మొదటి భార్య ఉత్తర్‌ప్రదేశ్‌లో ఉంటుండగా ఇద్దరు కుమార్తెలు, రెండో భార్య పార్వతితో కలిసి మిశ్రా నల్లసొపారాలోనే ఓ ఇంట్లో నివసిస్తున్నాడు.

ఈ క్రమంలోనే గతేడాది యోగిత అనే యువతిని మూడో వివాహం చేసుకున్నాడు. ప్రస్తుతం ఆమెతో లింక్ రోడ్‌ లోని ఓ అపార్ట్‌మెంట్‌లో కలిసి ఉంటున్నాడు. ఈ నేపథ్యంలోనే రెండో భార్య వద్దకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. అరకొరగా డబ్బులు పంపిస్తున్నప్పటికీ అవి ఖర్చులకు సరిపోకపోవడంతో ఆమె కూలి పనులకు వెళ్తోంది. దీంతో తన పరిస్థితికి యోగితే కారణమని ఆమెపై కక్ష పెంచుకున్న పార్వతి ఆమె అడ్డు తొలగించుకుంటేనే తన కాపురం బాగుపడుతుందనుకుని హత్యకు ప్లాన్ చేసింది. ఫిబ్రవరి 28న వ్యాపార పనుల నిమిత్తం మిశ్రా గుజరాత్ వెళ్లడంతో యోగిత ఒక్కతే ఇంట్లో ఉంది.

ఈ విషయం తెలుసుకున్న పార్వతి, మొదటి భార్య ఇద్దరు కుమార్తెలతో పాటు వారిలో ఒకరి బాయ్‌ఫ్రెండ్‌ తో కలిసి అపార్ట్‌మెంట్‌కు చేరుకుని యోగిత గొంతు నొక్కి చంపేసింది. ఆ తర్వాత మృతదేహాన్ని దుప్పటిలో చుట్టి సమీపంలోని ఓ షాపింగ్ మాల్ దగ్గర పడేసింది. మార్చి 1న మృతదేహాన్ని చూసిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా ఓ ఆటోలో మృతదేహాన్ని తీసుకొచ్చి పడేసినట్లు గుర్తించారు. అయితే ఆటో నంబర్ వీడియోలో స్పష్టంగా కనిపించకపోవడంతో పోలీసులు చాలా శ్రమించాల్సి వచ్చింది. సుమారు 4వేల మందిని ప్రశ్నించి చివరకు ఆటో డ్రైవర్‌ ను గుర్తించారు. అతడిని ప్రశ్నించగా నిందితుల ఆచూకీ తెలిపాడు. దీంతో పోలీసులు పార్వతితో పాటు మిగిలిన వారిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి నెట్టారు.