జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌ ! కళ్ళు చెదిరే డేటా ప్లాన్లు

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

ప్రత్యర్థుల గుండెల్లో ఎప్పడికప్పుడు గుబులు పుట్టించే రిలయన్స్‌ జియో తన కస్టమర్లకు మరో గుడ్‌న్యూస్‌ అందించింది. కంపెనీ తన ప్రీపెయిడ్‌ యూజర్లకు కొత్తగా డబుల్‌ ధమాకా ఆఫర్‌ ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద అదనంగా తన యూజర్లకు 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు తెలిపింది. ఎయిర్‌టెల్‌కు పోటీగా జియో ఈ ఆఫర్‌ను మంగళవారం ప్రకటించింది. ఎయిర్‌టెల్‌ ఇటీవలే తన రూ.149, రూ.399 ప్లాన్లపై అదనంగా 1 జీబీ డేటా అందించనున్నట్టు ప్రకటించింది. దీనికి కౌంటర్‌గా జియో తన ఎంపిక చేసిన ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్యాక్‌లపై అదనంగా 1.5 జీబీ డేటా ఇవ్వనున్నట్టు పేర్కొంది.

అయితే ఎయిర్‌టెల్‌ ఈ అదనపు డేటాను ఎంపిక చేసిన యూజర్లకు ఇస్తే, జియో తన యూజర్లందరికీ ఈ ఆఫర్‌ను అందుబాటులో ఉంచింది. నేటి నుంచి జూన్‌ 30 వరకు ఈ ఆఫర్‌ యూజర్లకు అందుబాటులో ఉంటుంది. డబుల్‌ ధమాకా ఆఫర్‌తో పాటు, ఈ ఆపరేటర్‌ కొత్తగా రూ.499 రీఛార్జ్‌ ప్యాక్‌ను కూడా 3 నెలల వాలిడిటీతో లాంచ్‌ చేసింది. ఈ కొత్త ప్యాక్‌పై రోజుకు 3.5 జీబీ డేటా అందించనున్నట్టు తెలిపింది.

జియో డబుల్‌ ధమాకా ఆఫర్‌ మేరకు..
రోజుకు 1.5 జీబీ డేటా పొందే రూ.149, రూ.349, రూ.399, రూ.449 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 3జీబీ డేటా పొందనున్నారు.
రోజుకు 2 జీబీ డేటా పొందే రూ.198, రూ.398, రూ.448, రూ.498 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 3.5 జీబీ డేటా లభ్యం.
రోజుకు 3 జీబీ డేటా పొందే రూ.299 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 4.5 జీబీ డేటా పొందనున్నారు.
రోజుకు 4 జీబీ డేటా పొందే రూ.509 ప్యాక్‌ యూజర్లకు ఇక నుంచి రోజుకు 5.5 జీబీ డేటా లభ్యం.
రోజుకు 5 జీబీ డేటా పొందే రూ.799 ప్యాక్‌ యూజర్లు ఇక నుంచి రోజుకు 6.5 జీబీ డేటా పొందనున్నారు.
అంతేకాకుండా, 300 రూపాయలు, ఆపై మొత్తాల అన్ని రీఛార్జ్‌‌లపై జియో 100 రూపాయల డిస్కౌంట్‌ ఇవ్వనుంది. 300 రూపాయల కంటే తక్కువ మొత్తాల రీఛార్జ్‌‌లపై 20 శాతం తగ్గింపు ఇస్తోంది. అయితే ఈ డిస్కౌంట్‌‌ల కోసం మైజియో యాప్‌, పేటీఎం లేదా ఫోన్‌ పే వాలెట్‌ ద్వారానే రీఛార్జ్‌ చేయించుకోవాలని తెలిపింది.