కరుణానిధి మరణంతో తమిళనాడు యావత్తు విషాదంలో మునిగిపోయింది. నేటి సాయంత్రం ఆయన అంత్యక్రియలు జరుగనున్నాయి. అయితే అన్నాదురై శకం తర్వాత దశాబ్దాలుగా డీఎంకే అధినేతగా వ్యవహరించిన కరుణానిధికి ముగ్గురు భార్యలు. మొదటి భార్య పద్మావతి, రెండో భార్య దయాళు అమ్మాల్. మూడో భార్య రాజాది అమ్మాల్. కరుణానిధి మొదటి భార్య పద్మావతికి జన్మించిన కుమారుడు ఎం.కె ముత్తు(కీ.శే). ముత్తుకు కలిగిన సంతానం అరివునిధి, తెన్మొళి.
ఇక కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్. వారి మొదటి కొడుకు ఆళగిరి. ఆళగిరి భార్య కాంతి. ఆళగిరికి ఒక కొడుకు, ఒక కూతురు, కుమారుడు దురై దయానిధి వ్యాపార వేత్త కాగా కూతురు కాయాల్ విళి గృహిణిగా ఉన్నారు. కరుణానిధి రెండో భార్య దయాళు అమ్మాల్ రెండో కుమారుడే స్టాలిన్. గత కొన్నేళ్లుగా కరుణ వయస్సు మీరుతుండటంతో రాజకీయ వారసుడు ఎవరనే విషయంలో పోటి నెలకొంది. కరుణానిధి మాత్రం స్టాలిన్వైపే మొగ్గు చూపారు. పార్టీ నిర్ణయాన్ని వ్యతిరేకించిన ఆళగిరిని పార్టీ నుంచి ఎప్పుడో బహిష్కరించారు. తనకు సరైన వారసుడు స్టాలినేనని కరుణ అనేక సార్లు ప్రకటించారు. పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడిగా స్టాలిన్ను నియమించారు. ఇక స్టాలిన్ కుమారుడు ఉదయనిది మారన్ తమిళ సినీ ఇండస్ట్రీలో హీరో కాగా, ఆయన సోదరి సెంతమరయి. దయాళు అమ్మాల్కు జన్మించిన చిన్న కొడుకు తమిళరసు కాగా, కూతురు సెల్వి. కాగా కరుణానిధి మూడో భార్య రాజాది అమ్మల్కు జన్మించిన కూతురు కనిమొళి. ఆమె భర్త అరవిందన్. మొత్తంగా చూసుకుంటే ఇదీ ఆయన వంశ వృక్షం.