కరోనా దెబ్బకి ఏపీఎస్ఆర్టీసీలో పెను మార్పులు

కరోనా వైరస్ సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు. ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసింది. అన్నీ రంగాలను ముంచేసింది. ఇక లాక్‌డౌన్ దెబ్బకు దేశంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. వ్యాపారాలు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. రెండు నెలలుగా జనాలంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. ప్రజా రవాణా పూర్తిగా నిలిచిపోయింది.. బస్సులు, ట్రైయిన్‌లు, విమానాలు, క్యాబ్ సర్వీసులు ఆగిపోయాయి. ఇప్పుడు లాక్‌డౌన్‌ను కాస్త సడలించడంతో మళ్లీ ప్రజా రవాణాకు లైన్ క్లియర్ అవుతోంది. ఇప్పటికే రైళ్లు పట్టాలెక్కగా.. విమానాలు కూడా గాల్లో ఎగిరేందుకు రెడీ కాబోతున్నాయి. ఇక మిగిలింది బస్సు సర్వీసులు మాత్రమే.

అయితే బస్సు సర్వీసులు ప్రారంభించడంపై ప్రభుత్వాలు గందరగోళంలో పడ్డాయి. బస్సుల్లో సీటింగ్, భౌతిక దూరం వంటి అంశాలపై ఇంకా ఓ క్లారిటీ లేదు. ప్రస్తుతం ఉన్న సీట్లను అలాగే ఉంచి భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకోవడమా.. లేకా సీట్లను తొలగించి సోషల్ డిస్టెన్స్ పాటించేలా మళ్లీ డిజైన్ చేసే అవకాశాలను పరిశీలిస్తుంది ప్రభుత్వం. అలాగే.. పొరుగు రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల విషయంలో కూడా స్పష్టత రావాల్సి ఉంది. రవాణాశాఖ అధికారులు కూడా దీనిపై తీవ్రంగా కసరత్తులు చేపట్టారు.

అదేవిధంగా ఏపీలో మాత్రం ప్రభుత్వం ఆర్టీసీ సర్వీసులు నడపడంపై ఫోకస్ పెట్టింది. ఆన్‌లైన్ టికెట్ బుకింగ్, సోషల్ డిస్టెన్స్ ను పాటించడం,మాస్క్, శానిటైజర్ వంటి నిబంధనల్ని అమలు చేయాలని భావిస్తోంది. అంతేకాకుండా భౌతిక దూరం పాటించేందుకు బస్సు సీట్లను తొలగించే పనిలో ఉన్నట్లు సమాచారం అందుతుంది. ప్రయాణికుల మధ్య దూరం ఉండేలా సూపర్ లగ్జరీ బస్సుల్లో మార్పలు చేశారని టాక్ నడుస్తోంది. అలాగే.. సీట్లను కుదించారని కూడా సమాచారం. ఈ బస్సుల్ని పరిశీలించి ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే మార్పులు చేసే అవకాశం ఉందని కూడా సమాచారం అందుతుంది. మొత్తానికి అనుకుంటే చాలు ఏపీ ప్రభుత్వం చకచకా కానిచ్చేస్తుంటుంది.