ఉన్మాదిలా మారిన ఓ తండ్రి

ఉన్మాదిలా మారిన ఓ తండ్రి

మూడో సారి ఆడపిల్లే పుట్టిందని.. ఓ తండ్రి ఉన్మాదిలా మారాడు. రోజుల పసికందును రోడ్డుపై పడేసి దారుణానికి ఒడిగట్టాడు. బండరాయితో మోదీ ముక్కుపచ్చలారని ఆ చిన్నారిని చంపేశాడు. కొమురం భీం జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.కన్న తండ్రే కాలయముడిగా మారాడు. కన్న బంధాన్ని, మానవత్వాన్ని మరిచి 40 రోజుల పాపను హతమార్చాడు.

కొమురం భీం జిల్లాలోని లైన్ గూడకు చెందిన మిశ్రమ్ బాబూరావు మహారాష్ట్రకు చెందిన మనీషాతో ఆరేళ్ల కిందట పెళ్లి జరిగింది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు. మొదటి కూతురు ఐదేళ్లు ఉండగా.. రెండో కూతురికి మూడేళ్లు..అయితే నెల కింద భార్య మనీషాకు మూడో కాన్పులో మళ్లీ ఆడపిల్ల పుట్టింది. ఈ క్రమంలోనే భార్యాభర్తలిద్దరూ సోమవారం రాత్రి గొడవ పడ్డారు.

దీంతో ఉన్మాదిలా మారిన తండ్రి.. 40 రోజుల పసికందును తీసి రోడ్డుపై పడేశాడు. అంతటితో ఆగకుండా బండ రాయి తీసుకొని పసికందు తలపై మోదాడు. దీంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటనపై సమాచారం అందడంతో కాగజ్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే మద్యం మత్తులోనే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.