భార్యను అమ్మేసిన యువకుడు

భార్యను అమ్మేసిన యువకుడు

పెళ్లయిన నెల రోజుల తర్వాత భార్యను అమ్మేసిన యువకుడు, ఆ డబ్బుతో స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశాడు. ఆమె గురించి కుటుంబసభ్యులు అడిగితే వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని చెప్పాడు. సంచలనం రేపి ఈ ఘటన ఒడిశాలో వెలుగులోకి వచ్చింది. ఒడిశాలోని బొలంగిర్ జిల్లా బెల్‌పడా పోలీస్ స్టేషన్ పరిధిలోని సులేకల గ్రామానికి చెందిన రాజేశ్ రానాకు ఆగస్టులో వివాహం జరిగింది. పెళ్లైన నెలరోజులకే ఆగస్టులో భార్యతో కలిసి ఇటుక బట్టీలో పనుల కోసం చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్ వెళ్లాడు.

కొద్ది రోజుల తర్వాత అక్కడ నుంచి రాజస్థాన్‌లోని బరన్ జిల్లాకు భార్యను తీసుకెళ్లిన రాజేశ్ రానా.. ఆమెను 55 ఏళ్ల వ్యక్తికి రూ.1.8 లక్షలకు విక్రయించాడు. ఆ సొమ్ముతో స్మార్ట్ ఫోన్ కొని, జల్సా చేసి తిరిగి స్వగ్రామానికి వచ్చాడు. భార్య గురించి ఆమె కుటుంబసభ్యులు అడిగితే, తనను వదిలిపెట్టి వెళ్లిపోయిందని అబద్దం చెప్పాడు. అతడి చెప్పిన మాటలు నమ్మశక్యంగా లేకపోవడంతో మహిళ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేసు నమోదుచేసిన బలంగీర్ పోలీసులు.. దర్యాప్తు చేపట్టగా అసలు విషయం బయటపడింది. యువకుడి కాల్ డేటాను పరిశీలించిన పోలీసులకు తీగ లాగితే డొంక కదిలినట్లు భార్యను విక్రయించాడని తేలింది. దీంతో ఆమెను తీసుకురావడానికి పోలీసులు బరాన్‌కు వెళ్లగా.. మహిళను కొనుగోలు చేసిన వ్యక్తి విడిచిపెట్టనని చెప్పాడు. గ్రామస్థులు కూడా ఆయన మద్దతుగా నిలిచి పోలీసులు అడ్డుకున్నారు. అతి కష్టం మీద స్థానిక పోలీసులు సాయంతో ఆమెను అతడి చెర నుంచి విడిపించి తీసుకొచ్చారు.

తాను రూ.1.8 లక్షలు ఇచ్చి మహిళను కొన్నానని బారన్ గ్రామానికి చెందిన 55 ఏళ్ల వ్యక్తి చెప్పాడు. అనంతరం భార్యను విక్రయించిన భర్త అయిన యువకుడిని పోలీసులు అరెస్టు చేసి కోర్టులో హాజరు పర్చారు. ఇటుక బట్టీల్లో పనులు కోసమని రాజస్థాన్ తీసుకెళ్లి అమ్మేశాడని బాధితురాలు వాపోయింది.ఇక, నిందితుడు మాత్రం ఆమెను అమ్మేయలేదని, రూ.60,000కు తాకట్టు పెట్టానని చెప్పడం గమనార్హం. అనారోగ్యానికి గురికావడంతో చికిత్స కోసం డబ్బులు అవసరమై ఆమెను తాకట్టు పెట్టినట్టు తెలిపాడు. అంతేకాదు, భార్యతో రోజూ ఫోన్‌లో మాట్లాడేవాడినని చెప్పాడు.