అత్తారింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

అత్తారింటి వేధింపులు భరించలేక యువతి ఆత్మహత్య

వరకట్నం కోసం అత్తారింటి వేధింపులు భరించలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన మండలంలోని బతికపల్లి గ్రామంలో మంగళవారం జరిగింది. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలప్ర కారం..గ్రామానికి చెందిన ఐలేని అంజి రెడ్డి–శోభారాణి దంపతుల చిన్న కూతురు దివ్య(22) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. దివ్యకు అదే గ్రామానికి చెందిన పెయ్యాల రాజిరెడ్డి–అంజలి దంపతుల కుమారుడు ప్రవీన్‌రెడ్డితో 2020 ఫిబ్రవరి 22న వివాహం జరిపించారు. వివాహ సమయంలో రూ.10 లక్షల నగదు, 20 తులాల బంగారం, ఎకరం భూమిని కట్నం కింద ముట్టజెప్పారు. ఈనేపథ్యంలో దివ్య హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తుండగా ప్రవీన్‌రెడ్డి స్థానికంగా వ్యవసాయం చేస్తున్నాడు.

కొద్ది రోజుల నుంచి అదనపు కట్నం తేవాలని లేదా కట్నం కింద ఇచ్చిన వ్యవసాయ భూమిని విక్రయించి డబ్బులు ఇవ్వాలని అత్త, మామ రాజిరెడ్డి, అంజలిలతో పాటు భర్త వేధిస్తున్నారు. అంతే కాకుండా ప్రవీన్‌రెడ్డి శారీరకంగా, మానసికంగా దివ్యను ఇబ్బందులను గురి చేయడంతో పాటు వాట్సప్‌ ద్వారా అసభ్యకరమైన మెస్సెజ్‌లు పంపించేవాడు. నాలుగు రోజులు క్రితం హైదరాబాద్‌ నుంచి తల్లి గారింటికి వచ్చిన దివ్య అత్తింటి పోరును తల్లిదండ్రులతో మొరపెట్టుకుంది.

దీంతో మంగళవారం ఉదయం దివ్యను ఆమె తల్లిదండ్రులు అత్తారింటికి తీసుకు వచ్చి వారితో మాట్లాడుతుండగా తిరిగి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో మనస్తాపానికి గురైన దివ్య ఉదయం 10 గంటలకు ఇంటి నుంచి బయటకు వెళ్లి గ్రామ శివారులోని తన తల్లిగారి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. అదనపు కట్నం వేధింపులు భరించలేక తమ కూతరు ఆత్మహత్య చేసుకుందని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్‌ రాజమనోహర్‌రెడ్డి, ఎస్సై నవతలు ఘటనా స్థలాన్ని సందర్శించి శవ పంచనామ నిర్వహించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.