Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
దశాబ్దాల పాటు పార్టీ కోసం శ్రమించిన శ్రామికుడు. బీజేపీ అత్యున్నత స్థాయిని ముందుగానే స్వప్నించిన స్వాప్నికుడు. ఆరెస్సెస్ సిద్ధాంతాలకు పూర్తిగా కట్టుబడి పనిచేసిన సూపర్ సీనియర్. అసలు ఆరెస్సెస్, సంఘ్ పరివార్ అంటే ఎక్కువమందికి తెలియని రోజుల్లో హిందుత్వకు అసలు సిసలు కేరాఫ్ అడ్రస్. ఆయనే ఎల్కే అద్వానీ. కానీ ఇప్పుడు అద్వానీ అసలు బీజేపీ సభ్యుడే కాదు. ఆయనకు సంఘ్ తో సంబంధమే లేదు అన్నట్లుగా ఉంది వ్యవహారం.
అద్వానీ పాక్ మాజీ అధ్యక్షుడు జిన్నాను పొగిడారన్న కారణంతో… పీఎం అభ్యర్థిగా పక్కనపెట్టారు. కనీసం వయసుకు తగ్గ గౌరవం ఇవ్వాలంటే రాష్ట్రపతి చేయాలని ఆయన శ్రేయోభిలాషులు కోరుకున్నారు. కానీ ఆయన తయారుచేసిన శిష్యులే ఆయనకు దారుణంగా వెన్నుపోటు పొడిచారు. ఇప్పుడు కేంద్రమంత్రులుగా చక్రాలు తిప్పుతున్న వెంకయ్య, సుష్మా, రాజ్ నాథ్, నితిన్ గడ్కరీ అందరూ అద్వానీ శిష్యులే. ఇక మోడీ గురించి చెప్పక్కర్లేదు. ఆయన ప్రధాని కావడానికి, గతంలో సీఎంగా కొనసాగడానికి అద్వానీయే కారణం.
కానీ ఇప్పుడు వారికి ఇవేమీ గుర్తులేవు. అద్వానీ అనే కరివేపాకుతో పనైపోయిందని తీసిపడేశారు. ఊరూ పేరూ లేని వారిని తెరపైకి తెచ్చి రాజకీయాలు చేయడంలో దిట్ట అయిన అమిత్ షా.. పేరు ప్రఖ్యాతులు ఉన్న వారి పరువు తీయడంలో కూడా అంతే తల పండిపోయారు. అసలు అద్వానీకి పదవులు ఓ లెక్క కాదు. ఎందుకంటే ఆయన గతంలోనే పార్టీ కోసం ప్రధాని పదవినే త్యాగం చేసిన వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గర ఇలాంచి నీచ రాజకీయాలు చేయడమే బీజేపీ కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. ఇప్పటి మోడీ.. రేపు మరో అద్వానీ కాడా.. అనే ప్రశ్న తలుచుకునే ధైర్యం కూడా కాషాయ నేతలకు లేదు.