‘ఒమిక్రాన్‌’‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు

‘ఒమిక్రాన్‌’‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు

దక్షిణాఫ్రికాలో బయటపడిన కొత్త వేరియంట్‌ ‘ఒమిక్రాన్‌’‌పై ప్రపంచవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శనివారం అత్యవసర సమావేశం నిర్వహించారు. దేశంలో కొవిడ్ పరిస్థితులు, వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై సమీక్ష నిర్వహించేందుకు ఉన్నతాధికారులతో ప్రధాని భేటీ అయ్యారు. కేబినెట్ కార్యదర్శి రాజీవ్‌ గౌబా, ప్రధాని ముఖ్య కార్యదర్శి పీకే మిశ్రా, కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌, నీతి-ఆయోగ్‌ సభ్యుడు డాక్టర్‌ వీకే పాల్‌ తదితరులు ఇందులో పాల్గొన్నారు.

ఒమిక్రాన్ వేరియంట్‌ వ్యాప్తి నేపథ్యంలో పలు దేశాలు మళ్లీ ఆంక్షలు బాట పట్టిన వేళ.. ప్రధాని భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది. తొలుత దక్షిణాఫ్రికాలో బయటపడ్డ ఒమిక్రాన్‌ వేరియంట్‌ ఇప్పటికే పలు దేశాలకు వ్యాపించింది. కొవిడ్ పూర్తిస్థాయి కోవిడ్ టీకా తీసుకున్నవారికీ ఈ వేరియంట్‌ సోకుతుండటంతో ప్రపంచ దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. అధిక మ్యూటేషన్ల కారణంగా డెల్టా కంటే ఇది ప్రమాదకారి కావచ్చని..వేగంగా వ్యాపించి, తీవ్ర లక్షణాలకు దారితీయవచ్చని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు, ఈ అంశంపై అత్యవసర సమావేశం నిర్వహించిన ప్రపంచ ఆరోగ్య సంస్థ.. ఈ వేరియంట్‌ను ఆందోళనకర రకంగా వర్గీకరించింది. దీనిపై యావత్ దేశాలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. అటు, పలు దేశాలు.. ఆఫ్రికా నుంచి విమానాల రాకపోకలపై నిషేధాలు జారీ చేశాయి. భారత్‌ కూడా ఆ దేశాల నుంచి విమానాల రాకపోకలను నిలిపివేయాలని ప్రధాని మోదీకి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ విజ్ఞప్తి చేశారు.