నెంబర్ వన్‌గా మోదీ

నెంబర్ వన్‌గా మోదీ

భారత దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి నెంబర్ వన్‌గా నిలిచారు. ప్రపంచంలోనే ప్రజాదరణ పొందిన నాయకుడుగా పేరొందారు. అత్యంత ప్రజామోదం ఉన్న దేశాధినేతల్లో నరేంద్ర మోదీ అగ్రస్థానంలో ఉన్నట్టు అమెరికాకు చెందిన మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వెల్లడించింది. మార్నింగ్ కన్సల్ట్ అనే సంస్థ వివిధ దేశాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో నరేంద్ర మోదీకి సానుకూలంగా 71 శాతం మంది, వ్యతిరేకంగా 21 శాతం మంది స్పందించారు.13 దేశాల అధినేతలపై మార్నింగ్ కన్సల్ట్ అభిప్రాయాలను సేకరించింది.ఆ నాయకులకున్న పాపులారిటీని అంచనా వేసింది.

వివిధ దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను ట్రాక్ చేసింmoది. ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండియా, ఇటలీ, జపాన్, మెక్సికో, దక్షిణ కొరియా, స్పెయిన్, బ్రిటన్, అమెరికా దేశాల నేతల అప్రూవల్ రేటింగ్స్‌ను తెలుసుకుంది. ఈ సర్వేలో నరేంద్ర మోదీ మొదటిస్థానంలో నిలవగా, మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఒబ్రేడర్ 66 శాతంతో రెండో స్థానంలో ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఆరో స్థానంలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్‌ చిట్టచివరి స్థానంలో ఉన్నారు. పార్టీగేట్ కుంభకోణంలో చిక్కుకున్న బోరిస్‌కు ప్రజాదరణ దారుణంగా తగ్గిపోయింది.

ఆయన అప్రూవల్ రేటింగ్ మైనస్ 43 వద్ద ఉంది. ఆయనను 69 శాతం మంది డిజప్రూవ్ చేశారు.మార్నింగ్ కన్సల్ట్ ప్రతి దేశంలో వయోజనులు నుంచి అభిప్రాయాలు సేకరించి ఈ రేటింగ్స్‌‌ను విడుదల చేసింది. ఆ సంస్థ అమెరికాలో సగటున రోజుకు 45 వేల మంది నుంచి అభిప్రాయాలు సేకరించగా మిగతా దేశాల్లో సగటున మూడు వేల నుంచి ఐదు వేల మందిని సర్వే చేసింది. కాగా మార్నింగ్ కన్సల్ట్ నిర్వహించిన గత సర్వేల్లోనూ నరేంద్ర మోదీ నెంబర్‌వన్ స్థానంలోనే ఉన్నారు. 2020 మే నెలలో వెల్లడించిన సర్వేలో మోదీకి 84 శాతం ప్రజామోదం లభించింది.