తిరుమలలో మోనో, ట్రామ్ తరహా రైళ్ల ఏర్పాటు

తిరుమలలో మోనో, ట్రామ్ తరహా రైళ్ల ఏర్పాటు

టీటీడీ ఛైర్మన్ గా పదవిలోకి వచ్చి ఏడాది కూడా కాకముందే.. కీలకమైన నిర్ణయాలతో.. భక్తులందరి మన్ననలు చూరగొంటున్న వైవీ సుబ్బారెడ్డి హయాంలో ఈ స్వప్నం కూడా సాకారం అవుతుందనే అభిప్రాయం కలుగుతోంది.తిరుమలకు చేరుకోవడానికి లైట్ మెట్రో లేదా మోనో రైలు ఏర్పాటుచేసే ఆలోచనను సీరియస్ గా పరిశీలిస్తున్నట్టు టీటీడీ ఛైర్మన్ వైవీసుబ్బారెడ్డి ప్రకటించారు. హైదరాబాదు మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని దీనికి సంబంధించి నివేదిక అడిగినట్లు కూడా వెల్లడించారు. తిరుమలలో మోనో, ట్రామ్ తరహా రైళ్ల ఏర్పాటును పరిశీలిస్తున్నట్లు చెప్పారు. పర్యావరణ పరిరక్షణకు కూడా రైలు వాడుక ఉపయోగపడుతుందనేది ఆయన మాట.

తిరుమలకు మొదటి ఘాట్ రోడ్డు, రెండో ఘాట్ రోడ్డు మాత్రమే ప్రస్తుతం రవాణాకు ఉన్న ఏకైక సదుపాయాలు. రెండో ఘాట్ రోడ్డును తిరుమల చేరుకోవడానికి, మొదటి ఘాట్ రోడ్డును తిరుమలనుంచి తిరుపతికి రావడానికి వాడుతుంటారు. అయినప్పటికీ.. గత కొన్నేళ్లలో ఈ మార్గాల్లో ట్రాఫిక్ చాలా విపరీతంగా పెరిగింది. కడప జిల్లాలోంచి కూడా తిరుమలకు ఓ బస్సు మార్గం ఏర్పాటుచేసే ఆలోచనల మీద కసరత్తు జరిగింది గానీ.. అవి కార్యరూపం దాల్చలేదు. రోడ్డు మార్గాలు రెండు, నడక మార్గాలు రెండు మాత్రమే ఉన్నాయి. లైట్ మెట్రో లాంటి కొత్త ఏర్పాటు వస్తే గనుక… ఘాట్ రోడ్లలో రద్దీతో పాటు ప్రమాదాలు కూడా తగ్గుతాయని ఆశించవచ్చు.

నిజానికి తిరుమల చేరుకోవడానికి తిరుపతినుంచి రైలు మార్గం ఏర్పాటు చేయాలనే ఆలోచన చాలా కాలం కిందటినుంచే ఉంది. రకరకాల సంభావ్యతలను పరిశీలించి దశాబ్దాల కిందటే ఈ ఆలోచనను పక్కన పెట్టేశారు. కానీ.. ఇప్పుడు సాంకేతికత మారుతోంది. మెట్రో రైలు, లైట్ మెట్రో వంటి వ్యవస్థలు.. అందుబాటులోకి వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలో వైవీ మళ్లీ తిరుమలకు రైలు ఆలోచన చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది.