దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుస నష్టాలు

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన సూచీలు మధ్యాహ్నం తర్వాత క్రమ క్రమంగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఉక్రెయిన్​- రష్యా యుద్ధం నేపథ్యంలో దేశీయ స్టాక్​ మార్కెట్లు తీవ్ర ఒడుదొడుకుల్లో కొనసాగాయి. ఆరంభంలో భారీ లాభాల్లో ఉన్న సూచీలు.. కొద్దిసేపటికే దిగొచ్చాయి. ఇరు దేశాల మధ్య బాంబుల మోతలకు తోడు క్రూడాయిల్‌ ధరలు భగ్గుమనడం మదుపరులను కలవరపెట్టింది.

ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ ధర​ 118.61 డాలర్లుగా ఉంది. ఈ ఒక్కరోజే 4 డాలర్లకు పైగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ముగింపులో, సెన్సెక్స్ 366.22 పాయింట్లు క్షీణించి 55,102.68 వద్ద స్థిరపడితే , నిఫ్టీ 108 పాయింట్లు లేదా 0.65% క్షీణించి 16,498 వద్ద ఉంది. నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.97 వద్ద ఉంది.

నిఫ్టీలో పవర్​ గ్రిడ్​ కార్పొరేషన్​, విప్రో, టెక్​ మహీంద్రా, ఐటీసీ, హెచ్​సీఎల్​ టెక్​ షేర్లు రాణిస్తే.. అల్ట్రా టెక్​ సిమెంట్​, ఏషియన్​ పెయింట్స్​, హిందుస్థాన్ యూనిలీవర్​, డాక్టర్​ రెడ్డీస్​ ల్యాబ్స్, మారుతీ​ డీలాపడ్డాయి. ఆటో, క్యాపిటల్ గూడ్స్ & బ్యాంక్ రంగాలలో సూచీలు 1-2 శాతం పడిపోగా, ఎఫ్ఎంసిజి & రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. అయితే మెటల్, ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, పవర్ సూచీలు 1-2 శాతం పెరిగాయి. బిఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.35 శాతం పెరిగాయి.