పవన్ తో వైసీపీ పొత్తు…తెరాస రాయబారం…!

Pawan Kalyan Sensational Comments On Ysrcp In Vijayawada

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పూర్తిగా రాజకీయ రంగంలోకి దిగినట్టు అనిపిస్తోంది. తన క్రిస్మస్ విదేశీ పర్యటన పూర్తి చేసుకున్న ఆయన ఇప్పుడు జిల్లాల వారీగా పార్టీ సమీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో చేసిన కీలక వ్యాఖ్యలు చర్చనీయాంశమవుతున్నాయి. పొత్తుల కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారని అది కూడా వారు నేరుగా మాట్లాడకుండా టీఆర్ఎస్ నేతలతో తనతో మాట్లాడిస్తున్నారని సంచనల ప్రకటన చేశారు. జనసేనకు ఎలాంటి బలం లేదని ఆయనతో పొత్తులు అవసరం లేదని వైసిపీ ప్రకటనలు గుప్పిస్తోంది. దీన్ని దృష్టిలో ఉంచుకునే పవన్ కల్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. అసలు బలం లేదని చెప్పిన పార్టీ తమతో పొత్తు కోసం టీఆర్ఎస్ నేతల ద్వారా రాయబారానికి ప్రయత్నిస్తోందనేది ఆయన లాజిక్. ఆంధ్రప్రదేశ్‌ లో సామాజిక సమీకరణాల ప్రకారం చూస్తే జగన్, పవన్ కలిస్తే తెలుగుదేశం పార్టీకి ఇబ్బందికరం అని విడివిడిగా పోటీ చేస్తే ఓట్లు చీలి టీడీపీ ఘన విజయం సాధిస్తుందన్న ఓ అంచనా ఉంది.

దీంతో ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామన్న తెలంగాణ సీఎం కేసీఆర్ జగన్ , పవన్ లను కలిపి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలనే ప్రయత్నంలో ఉన్నారని కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై లోలోపల ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయో తెలీదు కానీ బయటకు మాత్రం రాలేదు. అటు జగన్ తోనూ ఇటు పవన్ తోనూ టీఆర్ఎస్ అగ్రనాయకత్వానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. అందుకే కేసీఆర్ చెబితే ఇద్దరూ చేతులు కలుపుతారని భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో టీఆర్ఎస్ ప్రయత్నాలు ప్రారంభించిందని పవన్ వ్యాఖ్యల ద్వారా బయటకు రావడం కలకలం రేపుతోంది. జగన్‌తో పవన్ కల్యాణ్ కలుస్తారో లేదో కానీ వారిద్దిరి మధ్య పొత్తుల కోసం చాలా తీవ్రమైన ప్రయత్నలే జరుగుతున్న విషయం మాత్రం పవన్ మాటల ద్వారా తేలిపోయింది. గతంలోనే ఈ రెండు పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరిగాయన్న వ్యాఖ్యలు టీడీపీ నేతలు చేశారు. కానీ ఈ వార్తలను ఆయా పార్టీలు ఖండించాయి. ఇప్పుడు పవన్ కల్యాణే నేరుగా వైసీపీ పొత్తుల కోసం టీఆర్ఎస్ నేతల ద్వారా సంప్రదిస్తోందని ప్రకటించడంతో రాజకీయంగా కీలక పరిణామాలు ఖాయమని తేలిపోయింది.