గోపిచంద్ చాలా ధైర్యవంతుడు

గోపిచంద్ చాలా ధైర్యవంతుడు

హీరో గోపి చంద్ కథానాయకుడిగా నటించిన చాణక్య ఈ శనివారం ప్రపంచవ్యాప్తంగా రిలీజవుతోంది. అయితే సైరా హోరులో చాణక్య హుషారు సరిపోవడం లేదు. ఇప్పటికే దర్శకుడు తిరు.. గోపిచంద్ ఇద్దరూ మీడియా ఇంటర్వ్యూలతో హడావుడి చేశారు. అయినా ఈ ప్రచారం సరిపోవడం లేదు. చాణక్యపై ఆశించిన హైప్ రాలేదు. ఎదుట భారీ చిత్రం ఉండగా.. గోపిచంద్ ధైర్యం అభిమానుల్లో చర్చకు వస్తోంది.

చాణక్య రిలీజ్ తర్వాత గోపి తదుపరి సంపత్ నంది సినిమాపై దృష్టి సారించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మిల్కీ బ్యూటీ తమన్నా కథానాయికగా నటిస్తోంది. ఇటీవలే హైదరాబాద్ లో లాంఛనంగా సినిమా మొదలైంది. అయితే తాజాగా ఈ సినిమా కథాంశం లీకవ్వడం అభిమానుల్లో వైరల్ గా చర్చకు వచ్చింది. క్రీడా నేపథ్యం ఉన్న చిత్రం ఇది. అందులో గోపిచంద్ .. తమన్నా ఇద్దరూ కబడ్డీ కోచ్ ల పాత్రలో నటిస్తున్నారు. పైగా ఏపీ – తెలంగాణ టీమ్ ల మధ్య పోటీ కూడా ఉంటుందట. ఆంధ్రా కబడ్డీ జట్టు కోచ్ గా గోపిచంద్ నటిస్తుంటే.. తెలంగాణ కబడ్డీ టీమ్ కి కోచ్ గా మిల్కీ తమన్నా నటించనుంది.

ఇప్పటికే తమన్నా కబడ్డీ ఆట కోచ్ గా రాణించేందుకు ఎల్బీ స్టేడియంలో శిక్షణ తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథాంశంలో మరో ఆసక్తికర విషయం ఏమంటే మొత్తం పాతిక నుంచి ముప్పయ్ మంది అందగత్తెల్ని కబడ్డీ ఆటకు ఎంపిక చేశారట. దీంతో స్క్రీన్ మొత్తం ఓవైపు ఆటతో మరోవైపు తమన్నాతో గిల్లికజ్జాలతో రసరమ్యంగా ఉంటుందట. కబడ్డీ ఆటతో తెలుగు లోగిళ్లకు ఉన్న కనెక్షన్ అంతా ఇంతా కాదు. అలాంటి ఆటను లైవ్ లో ఆడుతుంటే ఎమోషన్ వర్కవుటవుతుందనే అంచనా వేస్తున్నారు.