హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం

హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం

హరియాణాలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఝజ్జర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో తొమ్మిది మృతిచెందగా.. మరికొందరు గాయపడ్డారు. బహదూర్‌గఢ్ సమీపంలోని కుండ్లీ-మనేసర్-పాల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్ వద్ద తెల్లవారుజామున 3.30 ప్రాంతంలో నాలుగు వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. రాజస్థాన్ నుంచి ఉత్తర్ ప్రదేశ్‌కు వస్తున్న కారును బండ్లీ-ఫరుఖ్‌నగర్ మధ్య డ్రైవర్ నిలుపుదల చేశాడు. మూత్ర విసర్జన కోసం దిగిన డ్రైవర్.. వాహనాన్ని నిలిపి ఉన్న స్టేషనరీలో లోడ్‌తో ఉన్న ట్రక్కు వెనుకన ఆపాడు.

ఇంతలో వెనుక నుంచి వచ్చిన ఓ ట్రక్కు కారును బలంగా ఢీకొట్టింది. దీంతో కారులోని ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు గాయపడ్డారు. మృతుల్లో చిన్నారి, ముగ్గురు మహిళలు ఉన్నారు. ప్రమాద సమయానికి వాహనంలో మొత్తం 11 మంది ఉన్నట్టు పోలీసులు తెలిపారు. అయితే, అటుగా వెళుతున్న మరో వాహనం ఘటనా స్థలిలో ఏం జరిగిందని తెలుసుకోడానికి ఆపగా.. వెనుక నుంచి వచ్చిన మరో ట్రక్కు దానిని ఢీకొట్టడంతో అందులోకి ఒకరు అక్కడిక్కడే మృతిచెందారు. ఇదే వాహనంలో ఉన్న పలువురు గాయపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ట్రక్కు బలంగా ఢీకొట్టడంతో మృతదేహాలు అందులో చిక్కకున్నాయి. వాటిని బయటకు తీయడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. మృతుల వివరాలు తెలియాల్సి ఉంది. కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ట్రక్కు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్టు ప్రాథమికంగా నిర్ధారించారు. వేగంగా వాహనం నడిపి 9 మంది మరణానికి కారకులయ్యారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.