ఘోర రోడ్డు ప్రమాదం

ఘోర రోడ్డు ప్రమాదం

కృష్ణగిరి– హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద రోడ్డు పక్కన నిలిపి ఉన్న గ్యాస్‌ ట్యాంకర్‌ లారీని కారు ఢీనడంతో ఏడాది చిన్నారితో పాటు ఐదుగురు మృతి చెందారు. వివరాల మేరకు… బెంగళూరుకు చెందిన రమేష్‌ కుటుంబ సభ్యులు 8 మంది కలిసి తమిళనాడులోని వేలూరు జిల్లా గుడియాత్తంలో బంధువుల శుభకార్యానికి కారులో వెళ్లారు. కార్యక్రమాన్ని ముగించుకొని సోమవారం ఉదయం బెంగళూరుకు తిరుగు ప్రయాణమయ్యారు.

క్రిష్ణగిరి-హోసూరు జాతీయ రహదారి సున్నంబట్టి వద్ద కారు అదుపుతప్పి పక్కనే నిలిపి ఉన్న ఖాళీ గ్యాస్‌ ట్యాంకర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ఏడాది బాలిక అంజలితో పాటు ఐదుగురు ఘటన స్థలంలోనే మృతి చెందారు. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. జిల్లా డీఎస్పీ రాజు, రవాణాశాఖాధికారి బాలమురుగన్, కందికుప్పం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బయటకు తీసి చికిత్స కోసం క్రిష్ణగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్నవారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.