మీరు సైలెంట్‌గా ఉంటే అంతా బాగుంటుంది

మీరు సైలెంట్‌గా ఉంటే అంతా బాగుంటుంది

‘‘మీతోనే మొదలు పెట్టాలనుకుంటున్నా… మీరు కాసేపు నిశ్శబ్దంగా ఉంటారా? విరాట్‌ కోహ్లి బాగున్నాడు. తను మానసికంగా ఎంతో బలవంతుడు. గత దశాబ్ద కాలంగా అంతర్జాతీయ క్రికెట్‌ ఆడుతున్నాడు. సుదీర్ఘకాలంగా ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ ఆడుతున్న వ్యక్తికి ఒత్తిడిని ఎలా అధిగమించాలో తెలుసు. కఠిన పరిస్థితులను ఎలా ఎదుర్కోవాలో తెలుసు’’ అంటూ టీమిండియా పరిమిత ఓవర్ల కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. మాజీ సారథి విరాట్‌ కోహ్లికి అండగా నిలబడ్డాడు.

అదే విధంగా… ‘‘నిజానికి ఇదంతా మీ వల్లే మొదలైంది. మీరు సైలెంట్‌గా ఉంటే అంతా బాగానే ఉంటుంది’’ అని మీడియా తీరుపై మండిపడ్డాడు. కాగా వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌లో కోహ్లి విఫలమైన సంగతి తెలిసిందే. మూడు మ్యాచ్‌లలో కలిపి కనీసం 30 పరుగులు కూడా చేయలేకపోయాడు. ఈ క్రమంలో కోహ్లి ఆట తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్‌ ముగిసిన తర్వాత మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రోహిత్‌కు కోహ్లి ఫామ్‌ గురించి ప్రశ్న ఎదురైంది.

ఇందుకు స్పందించిన హిట్‌మ్యాన్‌ కోహ్లికి పెద్దన్నలా అండగా నిలబడ్డాడు. అతడిలో ఆత్మవిశ్వాసం మెండు అని, ఫామ్‌ గురించి ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని గట్టిగా కౌంటర్‌ ఇచ్చాడు.ఇక ఫిబ్రవరి 16 నుంచి విండీస్‌తో టీ20 సిరీస్‌ నేపథ్యంలో మంగళవారం వర్చువల్‌ సమావేశంలో పాల్గొన్న రోహిత్‌ శర్మ మరోసారి కోహ్లికి మద్దతుగా నిలిచాడు. కాగా వెస్టిండీస్‌తో కోల్‌కతా వేదికగా మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ జరుగనుంది. ఇప్పటికే వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి జోరు మీదున్న రోహిత్‌ సేన టీ20 సిరీస్‌లోనూ ఇదే ఫలితాన్ని పునరావృతం చేయాలని భావిస్తోంది.