విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు

విరాట్‌ కోహ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు

టీమిండియా సారథి విరాట్‌ కోహ్లిపై ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌, వ్యాఖ్యాత నాసిర్‌ హుస్సెన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అనేక జట్లు మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉండాలనే ఫార్ములా పాటిస్తున్నాయని పేర్కొన్న హుస్సెన్‌ ఆ ఫార్ములా భారత్‌కు వర్తించదని అన్నారు. ఎందుకుంటే ప్రస్తుత సారథి కోహ్లికి కెప్టెన్సీ పంచుకోవడం ఇష్టముండదని అభిప్రాయపడ్డాడు. కోహ్లి చాలా గంభీరమైన వ్యక్తి అని, తన బాధ్యతలను మరొకరితో పంచుకునేందుకు ఇష్టపడడని తెలిపాడు.

అయితే ఇంగ్లండ్‌ విషయంలో ఇలా కుదరదని, మూడు ఫార్మట్లకు వేర్వేరు కెప్టెన్లు ఉంటారని గుర్తుచేశాడు. ఇక ఫార్మట్‌కొక కోచ్‌ ఉండాలనే కొత్త ప్రతిపాదనను నాసిర్‌ హుస్సెన్‌ తెరపైకి తీసుకొచ్చాడు. ఇంగ్లండ్‌ మాజీ కోచ్‌ ట్రెవర్‌ బెయిలీస్‌ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో విజయవంతం అయ్యాడని కానీ టెస్టు క్రికెట్‌లో అంతగా సక్సెస్‌ కాలేదని అభిప్రాయపడ్డాడు. బెయిలీస్‌ శిక్షణలో పరిమిత ఓవర్ల క్రికెట్‌లో ఇంగ్లండ్‌ విజయం సాధించిందని కానీ టెస్టుల్లో ఘోరంగా విఫలమైందన్నాడు. ఈ కారణంగానే మూడు ఫార్మట్లకు వేర్వేరు కోచ్‌లు ఉంటే బాగుంటుందని హుస్సెన్‌ పేర్కొన్నాడు. అయితే ప్రస్తుత టీమిండియా కోచ్‌ రవిశాస్త్రి అన్ని ఫార్మట్లలో అత్యుత్తమ కోచింగ్‌ ఇస్తున్నాడని, అతడి శిక్షణలో ఆటగాళ్లు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నారని నాసిర్‌ హుస్సెన్‌ ప్రశంసించాడు.