Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తరచుగా వివాదాస్పద వ్యాఖ్యలు చేసే బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి తాజాగా అత్యంత వివాదాస్పదమైన ఓ అంశంపై ఎవరికీ తెలియని సంచలన సమాచారం అందించారు. అయోధ్యలో రామమందిర నిర్మాణపనులు వచ్చే ఏడాది ఆగస్టులో ప్రారంభమై, దీపావళినాటికి ముగుస్తాయని, వచ్చే దీపావళినాటికి ఆలయం సిద్ధమవుతుందని సుబ్రహ్మణ్యస్వామి వ్యాఖ్యానించారు. రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదంపై తుది విచారణ డిసెంబరు 5 నుంచి సుప్రీంకోర్టులో ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలుచేశారు. రామజన్మభూమి స్థలం తమదేనంటూ ముస్లిం పార్టీలు చేసిన వాదనను అలహాబాద్ హైకోర్టు కొట్టివేసిన సంగతిని స్వామి గుర్తుచేశారు. రామ జన్మభూమిలో పూజలు చేసుకోవడం తమ ప్రాథమిక హక్కని, తాను వాదించానని తెలిపారు.
సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను పరిగణనలోకి తీసుకుంటే… సాధారణ హక్కులపై ప్రాథమిక హక్కులదే పై చేయి అవుతుందని ఆయన చెప్పారు. ఈ అంశాన్ని బట్టి చూస్తే … ఇకపై కేసు నిలవబోదని, వివాదాస్పద ప్రాంతం రామజన్మభూమే అని తీర్పు వస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తంచేశారు. సాధారణంగా సుబ్రహ్మణ్యస్వామి కచ్చితమైన సమాచారం ఉంటేనే మాట్లాడతారు. రాజకీయాలకు, నేతలకు సంబంధించి గతంలో ఆయన చెప్పిన అనేక విషయాలు తర్వాత నిజమయ్యాయి. దీన్ని గమనిస్తే… రామజన్మభూమి వివాదం గురించి నమ్మకమైన వర్గాల ద్వారా ఆయనకు కచ్చితమైన సమాచారం అందినట్టు అర్ధమవుతోంది. సుబ్రహ్మణ్యస్వామి చెప్పిన దాని ప్రకారం సుప్రీంకోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా రానుంది. అత్యున్యతన్యాయస్థానంలో కేసు గనక గెలిస్తే..ఇక బీజేపీ రామ మందిరం నిర్మించకుండా ఎవరూ అడ్డుకోలేరు. బీజేపీ, ఆ పార్టీ మాతృసంస్థ ఆరెస్సెస్ అసలైన లక్ష్యం రామమందిర నిర్మాణమే. మోడీ తమ లక్ష్యాన్ని నెరవేరుస్తారని ఆరెస్సెస్ ఆయనపై నమ్మకంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి వ్యాఖ్యల తరువాత..ఆ నమ్మకం నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.