టీటీడీ పాలనా నిర్వహణపై బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి గతంలో సుప్రీం కోర్టులో పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించే తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఏపీ ప్రభుత్వం తన గుప్పిట్లో ఉంచుకుందని విరాళాలు, కానుకల రూపంలో ఆలయానికి ఆదాయం వస్తున్నా ఆడిటింగ్ సరిగా జరగడం లేదని ఈ పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. అయితే ఆయన వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ విషయం స్థానిక అంశం కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని విచారణ జరపలేమని కోర్టు పేర్కొంది. హైకోర్టుకు వెళితే తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ఆ కోర్టును ఆశ్రయించాలని సూచించింది. సుప్రీం కోర్టు పిటిషన్ను తిరస్కరించడంపై స్వామి ట్విట్టర్లో స్పందించారు. తిరుపతి విషయంలో తన పిటిషన్ మీద హైకోర్టును ఆశ్రయించాలని సుప్రీం కోర్టు ఆదేశించిందని.. తాను హైకోర్టును ఆశ్రయిస్తానన్నారు స్వామి.