సురేష్ బాబు సంచలన నిర్ణయం

Suresh Babu making Hiranya Kashyapa Movie with 100 cr Budget

టాలీవుడ్‌ ప్రముఖ నిర్మాతగా సురేష్‌బాబుకు మంచి పేరు ఉంది. అభిరుచి కలిగిన నిర్మాత రామానాయుడు వారసుడిగా సురేష్‌బాబు మంచి పేరును దక్కించుకున్నాడు. అప్పట్లో రామానాయుడు భారీ బడ్జెట్‌ చిత్రాలను నిర్మించేందుకు ఆసక్తి చూపించేవారు. కాని సురేష్‌బాబు మాత్రం సేఫ్‌ గేమ్‌ ఆడేందుకు మాత్రమే ఆసక్తి చూపిస్తాడు. ఇతర నిర్మాతలు భారీ బడ్జెట్‌ చిత్రాతో వరుసగా చిత్రాలు నిర్మిస్తున్న సమయంలో సురేష్‌బాబు మాత్రం తన ప్రతి సినిమాను కూడా 10 నుండి 20 కోట్ల లోపు మద్య బడ్జెట్‌ చిత్రాలను మాత్రమే చేస్తున్నాడు. అంతకంటే ఎక్కువ ఉందనిపిస్తే సహ నిర్మాతను చూసుకుంటున్నాడు. ఎక్కువ రిస్క్‌ చేయకుండా డిస్ట్రిబ్యూషన్‌తో డబ్బులు సంపాదిస్తున్న సురేష్‌బాబు మొదటి సారి భారీ బడ్జెట్‌తో సినిమాకు రెడీ అవుతున్నాడు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దాదాపు 100 కోట్ల బడ్జెట్‌తో సురేష్‌బాబు ఒక చిత్రాన్ని నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. తాజాగా సురేష్‌ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది. ఆసినిమా ప్రమోషన్స్‌ సమయంలోనే సురేష్‌బాబు 100 కోట్ల చిత్రం గురించి చిన్న హింట్‌ ఇచ్చాడు. గుణశేఖర్‌ దర్శకత్వంలో ‘హిరణ్యకశ్యప’ అనే టైటిల్‌తో ఒక పౌరాణిక చిత్రానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని, తమ బ్యానర్‌లోనే ఇప్పటి వరకు రానంత బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని చేస్తున్నట్లుగా సురేష్‌బాబు చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌ వర్క్‌ను గుణశేఖర్‌ పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 2019లో సెట్స్‌పైకి సినిమాను తీసుకు వెళ్లి, సినిమాను 2020లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది.