పాతబస్తీలో విషాదం

పాతబస్తీలో విషాదం

దీపావళి పండుగ రోజున హైదరాబాద్‌లోని పాతబస్తీలో విషాదం చోటుచేసుకుంది. ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని టపాసులు పేలి ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా.. మరొకరు గాయపడ్డారు. కందికల్ గేట్ సమీపంలో పియూపీ వర్క్ యూనిట్ ఓపెన్ స్థలంలో జరిగిన ప్రమాదంలో పశ్చిమ్ బెంగాల్‌కు చెందిన ఇద్దరు యు వకులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన మరో యువకుడు ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

కందికల్ గేట్ ప్రాంతంలో ఉల్లాస్ అనే వ్యక్తి గత కొంత కాలంగా ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ బొమ్మలు తయారు చేసే యూనిట్‌ను నడుపుతున్నాడు. ఈ నేపథ్యంలో దీపావళి పూజ అనంతరం కొన్ని టపాసులను ఆ యూనిట్‌లో పనిచేసే బిష్ణు పదా మహ, జగన్నాథ్ మాలిక్, ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన వీరేంద్ర కుమార్ కార్మికులకు ఇచ్చి వెళ్లాడు. గురువారం రాత్రి ఒక్కసారిగా అక్కడ ప్రమాదవశాత్తూ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో విష్ణు, జగన్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో యువకుడు వీరెన్ తీవ్ర గాయాల పాలయ్యాడు.

భారీ శబ్దం, ఆర్త నాదాలతో ఉలిక్కి పడ్డ స్థానికులు ఈ ఘటనపై పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫలక్‌నుమా ఏసీపీ మాజిద్, చార్మినార్ ఏసీపీ భిక్షం రెడ్డి, ఛత్రినాక ఇన్ స్పెక్టర్ ఖాదర్ జిలాని, ఫలక్ నుమా ఇన్ స్పెక్టర్ దేవేందర్‌లు పరిస్థితి ని సమీక్షించారు. తీవ్రంగా గాయపడిన వీరేంద్రను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.ఘటనా స్థలికి క్లూస్ టీమ్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. విష్ణు, జగన్ మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. కేసు నమోదుచేసిన పోలీసులు పేలుడు గల కారణాలను అన్వేషిస్తున్నారు.