Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవలే నాగార్జునతో ఒక చిత్రాన్ని ప్రారంభించాడు. ఆ సినిమా పనిలో ఉన్నాడు, వివాదాస్పద అంశాలు ఏమీ మాట్లాడటం లేదు అనుకుంటున్న లోపే మరో వివాదాస్పద అంశంతో మీడియా ముందుకు వచ్చాడు. ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా చిత్రాన్ని చేస్తాను అంటూ ప్రకటించి సంచలనం సృష్టించిన వర్మ ఆ చిత్రాన్ని పక్కకు పెట్టినట్లుగా ఉన్నాడు. ప్రస్తుతం వర్మ ‘కడప రెడ్ల నిజాలు’ అనే వెబ్ సిరీస్ను తెరకెక్కించేందుకు సిద్దం అవుతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయ్యింది. తన బ్యానర్లో తన అసోషియేట్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ను ప్రారంభించాలని వర్మ నిర్ణయించుకున్నాడు.
కడప రెడ్ల నిజాలు అంటూ టైటిల్తోనే వర్మ వివాదాస్పదం అవుతున్నాడు. కడప జిల్లా అనేది ఫ్యాక్షనిస్టులకు పెట్టింది పేరు అంటారు. గతంలో కడప ఫ్యాక్షనిస్టుల నేపథ్యంలో సినిమాలు వచ్చాయి. అయితే అవన్ని కల్పితాలు. కాని వర్మ చేయబోతున్న వెబ్ సిరీస్ మాత్రం నిజాలు, రియల్ లైఫ్ జీవితాలు అంటూ సమాచారం అందుతుంది. కడప జిల్లా నుండి పలువురు రాజకీయ నేతలు వచ్చారు. వారిలో రెడ్లు చాలా ఎక్కువ మంది ఉన్నారు. రాజశేఖర్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డిలు కడప జిల్లా అనే విషయం తెల్సిందే. దాంతో వర్మ చూపించబోతున్న వెబ్ సిరీస్లో కడప రెడ్ల గురించి ఏం చూపించబోతున్నారు, జగన్ మోహన్ గురించి అందులో పాజిటివ్గా ఉంటుందా లేదా నెగటివ్గా ఉంటుందా అని అంతా చర్చించుకుంటున్నారు. వర్మ రేపు ఉదయం ‘కడప రెడ్ల నిజాలు’ టీజర్ను విడుదల చేస్తాను అంటూ ప్రకటించాడు. ఆ టీజర్ వచ్చిన తర్వాత అసలు విషయంపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.