గుజరాత్ లో బీజేపీ ప్రభుత్వం కొలువుతీరింది. ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ, ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. వారితో పాటు 20 మంది మంత్రులతో గవర్నర్ ఓపీ ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతో పాటు పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినప్పటికీ మెజార్టీ బాగా తగ్గడంతో విజయ్ రూపానీకి మరోసారి అవకాశం ఇవ్వబోరని అంతా భావించారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రమంత్రులు స్మృతిఇరానీ, మాండవీయ పేర్లు ముఖ్యమంత్రి రేసులో వినిపించాయి. కానీ మోడీ, షాలు విజయ్ రూపానీ వైపే మొగ్గుచూపారు.
ఈ నెల 22 రూపానీ శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. 23 న బీజపీ నేతలు గవర్నర్ ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరారు. విజయ్ రూపానీ 2016 లో తొలిసారి ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టారు. మోడీ స్థానంలో ముఖ్యమంత్రి అయిన ఆనంది బెన్ పటేల్ గత ఏడాది అనూహ్యంగా రాజీనామా చేశారు. దీంతో ఆమె స్థానంలో విజయ్ రూపానీ సీఎం పదవి స్వీకరించారు. ఇప్పుడు ఎన్నికల్లో పార్టీని గెలిపించి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు.