మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి

మైలురాయిని అందుకున్న విరాట్ కోహ్లి

టీమిండియా స్టార్‌ బ్యాటర్‌ విరాట్ కోహ్లి టెస్టుల్లో 8 వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మొహాలీ వేదికగా శ్రీలంకతో జరగుతున్న తొలి టెస్ట్‌లో విరాట్‌ ఈ ఘనతను సాధించాడు. అదే విధంగా కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడుతున్న సంగతి తెలిసిందే. ఇక టెస్ట్‌ క్రికెట్‌లో 8 వేల పరుగుల చేసిన ఆరో భారత బ్యాటర్‌గా కోహ్లి నిలిచాడు. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, రాహుల్ ద్రావిడ్, సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్, వీరేంద్ర సెహ్వాగ్‌లు మాత్రమే ఈ ఘనత సాధించారు. విరాట్‌ కోహ్లి 169 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఫీట్‌ను సాదించాడు. 154 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనతను సాధించి సచిన్‌ తొలి స్ధానంలో ఉన్నాడు.

అదే విధంగా కోహ్లి తప వందో మ్యాచ్‌లో మరో రికార్డును కూడా సాధించాడు. 100వ టెస్టులో 8 వేల టెస్టు పరుగులను అందుకున్న రెండో క్రికెటర్‌గా కోహ్లి నిలిచాడు. అంతకుముందు ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ ఈ ఘనత సాధించాడు. 2006లో దక్షిణాఫ్రికాపై 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడిన పాంటింగ్‌ 8000 పరుగులను పూర్తి చేసుకున్నాడు. ఇక ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లి 47 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరాడు. అయితే కోహ్లి సెంచరీ సాధిస్తాడని భావించిన అభిమానులకు మరోసారి నిరాశే ఎదురైంది.