కమల్ హాసన్ నటించిన ‘విశ్వరూపం 2’ విడుదకు సిద్దం అయ్యింది. దాదాపు ఆరు సంవత్సరాల క్రితం అనుకున్న ఈ చిత్రం ఇన్నాళ్లకు విడుదలకు సిద్దం అయ్యింది. విశ్వరూపం మొదటి పార్ట్ విడుదలకు అనేక సమస్యలు ఎదురయ్యాయి. అప్పటి ప్రభుత్వం కమల్ను చాలా ఇబ్బందులకు గురి చేయడం జరిగింది. ఏదోలా విశ్వరూపంను విడుదల చేసిన కమల్ వెంటనే విశ్వరూపం 2ను మొదలు పెట్టాడు. కేవలం ఆరు నెలల్లో రెండవ పార్ట్ను తీసుకు రావాలని కమల్ అనుకున్నాడు. ఆరు నెలలు కాస్త ఆరు సంవత్సరాలు అయ్యింది. సరే ఇప్పుడు అయినా వస్తుందిలే అనుకుంటున్న సమయంలో ఆర్థికపరమైన చిక్కుల్లో కమల్ చిక్కుకోవడంతో విశ్వరూపం 2 విడుదలకు సమస్య ఏర్పడినది.
‘మర్మయోగి’ చిత్రం కోసం కమల్ హాసన్ 2008వ సంవత్సరంలో పిరమిడ్ సైమిర సంస్థ వద్ద దాదాపు 5.5 కోట్ల రూపాయలను తీసుకోవడం జరిగింది. కాని కొన్ని కారణాల వల్ల సినిమాను మొదలు పెట్టి మద్యలోనే వదిలేశాడు. వంద కోట్ల బడ్జెట్తో అనుకున్న ఆ సినిమా ఆగిపోవడంతో కమల్ కూడా చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇప్పుడు పిరమిడ్ సైమిర సంస్థ కమల్ తమకు ఇవ్వాల్సిన 5.5 కోట్ల రూపాయలు వడ్డీతో సహా 7.3 కోట్ల ఇవ్వాల్సిందే అంటూ కోర్టుకు వెళ్లడం జరిగింది. కమల్ ఈ విషయమై సోమవారం లోపు సమాధానం ఇవ్వాల్సి ఉంది. కమల్ సమాధానంకు తృప్తి పడితే కోర్టు సినిమా విడుదలకు అడ్డుకోక పోవచ్చు. కాని సమాధానం సరిగా లేకుంటే ఖచ్చితంగా 7.3 కోట్లు చెల్లిస్తేనే సినిమా విడుదలకు అనుమతించే అవకాశం ఉంది. మరి ఈ చిత్రం విడుదల అవుతుందో లేదో మరో రెండు మూడు రోజుల్లో తేలిపోయే అవకాశం ఉంది. ముందుగా ఈ చిత్రాన్ని ఆగస్టు 10న విడుదల చేయాలని భావించారు. అందుకోసం ప్రమోషన్స్ కూడా చేస్తున్నారు.