రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం…జాగ్రత్త…!

YS Jagan Shocking Comments On Chandrababu Naidu At Anantapur

ఈ రోజు అనంతపురంలో వైసీపీ నిర్వహించిన సమర శంఖారావం సభలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు మీద విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రాక్షసులతో యుద్ధం చేస్తున్నామని.. ప్రతి నిమిషం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వైసీపీ బూత్ కన్వీనర్లు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. చంద్రబాబు టార్గెట్‌గా నిప్పులు చెరిగారు. చంద్రబాబు అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఓటుకు రూ. 3 వేలు ఇస్తామంటూ గ్రామాల్లోకి డబ్బు మూటలు తరలిస్తారని విమర్శించారు. చంద్రబాబు డబ్బులిస్తే తీసుకోవాలని ఓటు మాత్రం వైసీపీకి వేయాలని జగన్ పిలుపు ఇచ్చారు. 55 నెలలు పాటు కడుపు మాడ్చి చివరి 3 నెలలు అన్నం పెడతానంటున్న వారిని ఏమనాలని ప్రశ్నించారు.

ప్రజారంజక పాలన అందించాలంటే రాక్షసులు, మోసగాళ్లతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని, అందుకు తాను సిద్ధంగా ఉన్నానని జగన్ పేర్కొన్నారు. చంద్రబాబు కుయుక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు విఙ్ఞప్తి చేశారు. తొమ్మిదేళ్లుగా నాతో పాటుగా మీరు కూడా ఎన్ని కష్టాలు అనుభవించారో తెలుసనీ కొంతమందిపై అక్రమ కేసులు పెట్టారనీ మరికొందరిని పథకాలకు దూరం చేశారనీ 1280 మందిపై అక్రమ కేసులు పెట్టారనీ మీకు తగిలిన ప్రతీ గాయం నా గుండెకు తగిలిందనీ అందుకే అధికారంలోకి రాగానే వాటన్నింటినీ ఎత్తివేస్తామని కుల, మత, పార్టీలకతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందిస్తామని జగన్ ప్రకటించారు. ఎన్నికల షెడ్యూలు రాబోతుందని వైసీపీ విజయంలో కీలక పాత్ర పోషించాల్సిన బాధ్యత మీపై ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఓటర్‌ లిస్టు నుంచి వైసీపీకి అనుకూలంగా ఉన్నవారిని ఓటర్‌ లిస్టు నుంచి తొలగిస్తున్నారని ఈ సనధర్భంగా జగన్ ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా 59 లక్షల దొంగ ఓట్లు ఉన్నాయన్నారు. దొంగ ఓట్ల విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని జగన్‌ సూచించారు.