పోలీసు స్టేషన్‌పై దాడి చేసిన ఎమ్మెల్యే…కేసు నమోదు 

MLA attacking police station ... Case registered

తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం మలికిపురంలో పోలీస్‌స్టేషన్‌పై దాడికి దిగి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసిన రాజోలు జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, ఆయన అనుచరులపై కేసులు నమోదు చేసినట్టు జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మి తెలిపారు.

మలికిపురంలో ఆదివారం సాయంత్రం కలిగితి కుమార్‌ గెస్ట్‌హౌస్‌లో పేకాడుతున్నట్టు వచ్చిన సమాచారంపై మలికిపురం ఎస్సై కేవీ రామారావు తన సిబ్బందితో వెళ్లి పేకాట శిబిరంపై దాడి చేసి తొమ్మిది మందిని అరెస్టు చేశారన్నారు. ఈ దాడిలో రూ.37,700 నగదు, ఆరు మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అస్మీ తెలిపారు.

దీని గ్యాంబ్లింగ్‌ యాక్ట్‌ ప్రకారం కేసు నమోదు చేశామన్నారు. వెంటనే రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌ సంఘటన స్థలంలో ఎస్సై రామారావుతో గొడవపడి మోటారు సైకిళ్లు, సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకునేందుకు వీల్లేదని గొడవపడ్డారన్నారు. .

దీంతో ఎమ్మెల్యే రాపాక, అతడి అనుచరుడు గెడ్డం తులసీభాస్కర్‌లు సుమారు 100 మంది అనుచరులతో స్టేషన్‌పై దాడి చేసి పోలీసులను నిందించుకుంటూ, పోలీస్‌స్టేషన్‌పై రాళ్లు రువ్వుతూ కిటీకీ అద్దాలు పగలుగొట్టారన్నారు.

పేకాడుతూ పట్టుబడిన వ్యక్తులను తక్షణం విడుదల చేయాలని పోలీసుల విధులకు ఆటంక పరిచారని ఎస్పీ నయీం అస్మీ వివరించారు. పోలీస్‌స్టేషన్‌పై దాడికి పాల్పడిన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అతడి అనుచరులపై ఏలూరు రేంజ్‌ డీఐజీ ఏఎస్‌ ఖాన్‌ ఆదేశాల మేరకు కేసులు నమోదు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ వివరించారు.