నిర్మాత నన్ను మానసికంగా వేధించాడు

నిర్మాత నన్ను మానసికంగా వేధించాడు

షూటింగ్‌ సమయంలో నిర్మాత తనను మానసికంగా వేధించాడని ఇరానీ నటి, బిగ్‌బాస్‌ ఫేం మందనా కరీమి సంచలన వ్యాఖ్యలు చేశారు. చిత్ర నిర్మాత ప్రవర్తించిన తీరు తననెంతో బాధపెట్టిందని వాపోయారు. ప్రస్తుతం మందనా సన్నీలియోన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ‘కోకో కోలా’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ క్రమంలో షూటింగ్ సమయంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరిస్తూ భావోద్వేగానికి లోనయ్యారు. కోకో కోలా సినిమా నిర్మత మహేంద్ర ధరివాల్‌, అతని కుమారుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని, మానసికంగా వేధింపులకు గురిచేశాడని ఆరోపణలు చేశారు. ఇదంతా కోకో కోలా సినిమా షూటింగ్‌ చివరి రోజు అయిన దీపావళి ముందు రోజు సెట్‌లో చోటుచేసుకుందని నటి తెలిపారు. చదవండి: అది నా సినిమా టైటిల్‌.. ఇచ్చేయ్‌

ఇటీవల ఓ మీడియాతో ఆమె మాట్లాడుతూ.. ‘‘గతేడాది నుంచి కోకో కోలా షూటింగ్‌ జరుగుతోంది. ఈ సినిమా షూట్‌లో పాల్గొన్న నేను మొదటి నుంచి చిత్ర యూనిట్ మొత్తానితో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. ముఖ్యంగా నిర్మాత మహేంద్ర ధరివాల్‌.. ఎవరైతే సెట్‌లో పూర్తి అహంకార భావం, ఆధిపత్యం చెలాయించే వ్యక్తి. ఈ వ్యక్తితో ముఖ్యంగా నవంబర్‌ 13న చేదు అనుభావాన్ని ఎదుర్కొన్నాను. షెడ్యూల్‌ ప్రకారం దీపావళి ముందు రోజు రాత్రి ఈ సినిమాకి సంబంధించి నా షూటింగ్‌ చివరి రోజు. అయితే సినిమాలో ఇంకొన్ని బ్యాలెన్స్‌ ఉన్నాయని.. అందుకు మరో గంట సెట్‌లోనే ఉండాలని నిర్మాత అన్నారు. కానీ నాకు అదే సమయంలో వేరే మీటింగ్స్ ఉండటంతో కుదరదని చెప్పాను. షూటింగ్‌ పూర్తి చేసుకున్న తర్వాత క్యారీవాన్‌లోకి వచ్చి డ్రెస్ మార్చుకుంటున్నా. చదవండి: ప్రముఖ సినీ గీత రచయిత ప్రేమ పెళ్లి

వెంటనే నిర్మాత నేరుగా క్యారీవాన్‌లోకి వచ్చి నాపై గట్టిగా అరవడం ప్రారంభించాడు. నేను బట్టలు మార్చుకుంటున్నా. కాసేపు బయట ఉండండి అని చెప్పిన వినలేదు. క్యారీ వాన్‌లోనే అరుస్తూ.. ‘నా మాట దాటి బయటకు వెళ్లలేవు. నేను నీకు ఒక గంట ఎక్కువ పని చేయమని అడిగాను. నువ్వు నా మాట విని తీరాలి. ఎందుకంటే నేను నిర్మాత. నీకు డబ్బులు ఇచ్చే వ్యక్తిని’ అని అరుస్తూ తన కొడుకుతో కలిసి అక్కడంతా సీన్‌ క్రియేట్‌ చేశాడు. ఆయన అరుపులు విని సెట్‌లోని వారందరూ నన్ను ఇబ్బందిగా చూశారు. ఒక అర్టిస్ట్‌తో ప్రవర్తించే విధానం ఇదేనా.. అందులోనూ ఒక మహిళతో ఇలా మాట్లాడటం ఎంత వరకు సమంజసం’’. అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

అయితే మందనా వ్యాఖ్యలపై స్పందించిన నిర్మాత మహేంద్ర నటి మాటలను ఖండించారు. షూటింగ్‌ చివరి రోజు మందనాకు రాత్రి 9 గంటల వరకు షిఫ్ట్‌ ఉందని, కానీ తను గంట ముందే వెళ్తానని గొడవ చేసిందన్నారు. ఇంకో గంట ఉండాని అభర్ధించినట్లు తెలిపారు. తనను అడిగే వ్యాన్‌లోకి వచ్చానని, అయినప్పటికీ తన మాటలు పెడచెవిన పెట్టి, వీడియోలు తీయడం ప్రారంభించిందని, అందుకే గట్టిగా చెప్పానన్నారు. అంతేగాక ఈ సినిమా ప్రాజెక్టు కోసం ముందుగా తనతో 7 లక్షల రూపాయలు కాంట్రాక్ట్‌ కుదుర్చుకున్నట్లు, కానీ తనతో చివరికి 17 లక్షలు వసూలు చేసిందని అన్నారు. అంత మొత్తంలో డబ్బులు ఇచ్చినా తనకు బాధ లేదని కానీ తమతో ఇలా భాద్యతరాహిత్యంగా ప్రవర్తించడం కరెక్టు కాదని హెచ్చరించారు.