హిట్టు కోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని పోరాటం

హిట్టు కోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని పోరాటం

హిట్టు కోసం ఎనిమిదేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నాడు అల్లరి నరేష్. 2012లో వచ్చిన నరేష్ సినిమా ‘సుడిగాడు’ తన కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఐతే ఆ చిత్రమే తనకు చివరి హిట్ అవుతుందని నరేష్ ఊహించి ఉండడు. ఈ ఎనిమిదేళ్లలో రెండంకెల్లో సినిమాలు చేశాడతను. కానీ ఏ ఒక్క సినిమా కూడా ఓ మోస్తరు విజయాన్నందుకోలేదు. రాను రాను అల్లరోడి సినిమాకు కనీస స్పందన కరవవుతూ వచ్చింది.

చివరిగా అతడి నుంచి వచ్చిన ‘సిల్లీ ఫెలోస్’ బాక్సాఫీస్ దగ్గర సిల్లీ సినిమాగానే మిగిలిపోయింది. ఐతే కామెడీ వేషాలు మరీ రొటీన్ అయిపోయి జనాలకు మొహం మొత్తేసిన నేపథ్యంలో నరేష్.. ఈసారి రూటు మార్చి ‘నాంది’ అనే సినిమా చేశాడు. కొత్త దర్శకుడు విజయ్ కనకమేడల ఈ చిత్రాన్ని రూపొందించాడు. ఈ సినిమా మొదలైనపుడు ఎవరూ పెద్దగా పట్టించుకున్నది లేదు.

కానీ ఈ మధ్య రిలీజ్ చేసిన పోస్టర్లు.. ఆపై వచ్చిన టీజర్ సినిమాపై ఆసక్తిని పెంచాయి. పోలీస్ స్టేషన్లు, జైళ్లలో అభాగ్యులపై జరిగే అరాచకాల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా అన్నది టీజర్ చూస్తేనే అర్థమైపోయింది. ఐతే ఈ టీజర్ రిలీజైన టైంలోనే పోలీస్ స్టేషన్లలో జరిగే ఘోరాల మీద దేశవ్యాప్తంగా పెద్ద చర్చ నడుస్తోంది. గత నెలలో తమిళనాడులోని శాతంకులంలో ఇద్దరు తండ్రీ కొడుకుల్ని చిన్న కారణంతో పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చి వాళ్లను దారుణంగా హింసించి వారి ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు పోలీసులు.

‘నాంది’ సినిమాలో కూడా హీరో పరిస్థితి ఇలాగే ఉంటుందట. అన్యాయంగా పోలీసుల చేతికి చిక్కి అల్లాడిపోయే వ్యక్తి పాత్రలో నరేష్ నటిస్తున్నాడు. లాకప్ డెత్‌ల గురించి పెద్ద చర్చ నడిచిన సమయంలోనే ‘నాంది’ టీజర్ రావడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఈ టీజర్‌కు బాగా కనెక్టయ్యారు. సినిమాతో ప్రేక్షకులు మరింతగా కనెక్టవుతారని.. తమిళనాడు లాకప్ డెత్స్‌తో రిలేట్ చేసుకునే సన్నివేశాలు సినిమాలో ఉంటాయని నరేష్ చెప్పాడు. ఇదిలా ఉంటే ఆంధ్రా ప్రాంతంలో ఇద్దరు తమిళులపై పోలీసుల అరాచకాల నేపథ్యంలో తమిళంలో ‘విసారణై’ అనే సినిమా తెరకెక్కింది. ఇప్పుడు తమిళనాట జరిగిన ఉదంతాలకు రిలేట్ చేసుకునేలా తెలుగు సినిమా తెరకెక్కడం యాదృచ్ఛికమే.