20 ఏళ్లకే ప్రభాస్ కోసం ఓ కథ రాసిన అశ్విన్

20 ఏళ్లకే ప్రభాస్ కోసం ఓ కథ రాసిన అశ్విన్

నాని ఇంకా స్టార్ కాకముందు అతను కథానాయకుడిగా ‘ఎవడే సుబ్రహ్మణ్యం’ అనే చిన్న సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు నాగ్ అశ్విన్. దాని తర్వాత అతను చేసింది ఒకే సినిమా. కానీ అంతలోనే ‘బాహుబలి’తో ఆల్ ఇండియా స్టార్‌గా మారిన ప్రభాస్‌తో సినిమా చేసే అవకాశం పట్టేశాడు.

అతడి రెండో సినిమా ‘మహానటి’ అంత మంచి గుర్తింపునిచ్చింది మరి. గురువు శేఖర్ కమ్ముల లాగా చిన్న, మీడియం రేంజి హీరోలతో క్లాస్ సినిమాలేవో చేసుకుంటాడనుకుంటే.. ఇలా ప్రభాస్ లాంటి పెద్ద మాస్ హీరోతో అతను సినిమా చేస్తాడని ఎవరూ ఊహించలేదు. ఐతే ‘మహానటి’ తర్వాత అనుకోకుండా కథ రాసి ప్రభాస్‌ను మెప్పించి.. అశ్వినీదత్‌ను ఒప్పించి ఈ సినిమా చేస్తున్నాడని అంతా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా కోసం అతను 13 ఏళ్లుగా నిరీక్షిస్తున్నట్లు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించడం విశేషం.

తాను దర్శకుడు కావాలని నిర్ణయించుకున్నాక.. 2006-07 మధ్య ప్రభాస్ కోసం ఓ కథ రాసినట్లు అశ్విన్ వెల్లడించాడు. ఇప్పుడు అదే కథకు మెరుగులు దిద్ది ప్రభాస్‌తో సినిమా చేయబోతున్నట్లు చెప్పాడు. 13 ఏళ్ల కిందట అంటే అప్పటికి అశ్విన్‌కు మహా అయితే 20 ఏళ్లుంటాయేమో. సినీ రంగంలో పెద్దగా అనుభవం కూడా లేదు. మరి అప్పటికే ప్రభాస్‌ను దృష్టిలో ఉంచుకుని కథ రాయడం.. ఇప్పటికీ అది ట్రెండీగా ఉండటం.. అంతర్జాతీయ స్థాయిలో, వందల కోట్ల బడ్జెట్‌తో ఆ సినిమాను తెరకెక్కించబోతుండటం ఆశ్చర్యం కలిగించే విషయమే.

చిత్ర వర్గాల సమాచారం ప్రకారం ఇది ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్ కలగలిసిన చందమామ కథలా ఉంటుందని చెబుతున్నారు. తమ సంస్థ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఫిలిం అని.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే అత్యంత భారీ బడ్జెట్లో తెరకెక్కబోతున్న చిత్రాల్లో ఒకటని ఈ సినిమా గురించి అశ్వినీదత్ ఓ సందర్భంలో అన్నారు. వచ్చే ఏడాది సెట్స్ మీదికి వెళ్లనున్న ఈ సినిమా 2022లో రిలీజయ్యే అవకాశాలున్నాయి.