పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

పెళ్ళిపై క్లారిటీ ఇచ్చిన మెగా హీరో

కరోనా క్రమంగా తగ్గుముఖం పడుతున్న వేళ మెగా వారింట పెళ్లి బాజాలు మోగాయి. డిసెంబర్ 9న నాగబాబు కుమార్తె, మెగా డాటర్ నిహారిక పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో ఇక మెగా ఫ్యామీలీలో ఉన్న కుర్ర హీరోల పెళ్ళెప్పుడు? అనే మ్యాటర్ జనాల్లో చర్చకు వచ్చేసింది. సరిగ్గా ఈ తరుణంలో మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తన లేటెస్ట్ మూవీ ‘సోలో బ్రతుకే సో బెటర్’ ప్రమోషన్స్‌లో భాగంగా మెగా వారింట అతిత్వరలో మరో పెళ్లి జరగబోతోందని హింట్ ఇచ్చాడు.

వాస్తవానికైతే నిహారిక పెళ్లికి ముందు నుంచే సాయి ధరమ్ తేజ్ పెళ్లి మ్యాటర్ జనాల్లో నానుతూ వస్తోంది. మెగా మేనల్లుడు అతిత్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడంటూ రూమర్స్ తెగ షికారు చేస్తున్నాయి. దీంతో మెల్లగా ఆ గాలిని అల్లు శిరీష్ వైపు తోసేశాడు సాయి ధరమ్ తేజ్. మెగా ఫ్యామిలీలో తనకంటే ముందు జరగబోయే పెళ్లి అల్లు శిరీష్‌దే అని తెలిపాడు. అంతేకాదు తనపై ఇంకొన్ని బాధ్యతలు ఉన్నాయని, అవి ఫినిష్ అయ్యాకే పెళ్లి చేసుకుంటానని చెప్పాడు సాయి ధరమ్ తేజ్.

దీంతో మెగా అభిమానుల చూపు ఒక్కసారిగా అల్లు శిరీష్‌పై పడింది. మీ పెళ్ళెప్పుడు అంటూ అయన వెంట పడటం ప్రారంభించారు నెటిజన్లు. దీంతో ఇక తప్పదని భావించి తన పెళ్లిపై క్లారిటీ ఇస్తూ ట్విట్టర్‌లో ఓ పోస్ట్ పెట్టాడు అల్లు వారబ్బాయి. ”హ‌హ‌హ‌.. తేజూ నా పెళ్లి విష‌యంలో స‌రదాగా జోక్ చేసి ఉంటాడంతే. మీరు దాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారేమో అనిపిస్తోంది. పెళ్లి విషయంలో ప్రస్తుతం మా పేరెంట్స్ నుంచి ఎలాంటి ఒత్తిడీ లేదు. నేను కూడా ఇంకా సింగిల్‌గా ఉండేందుకే ప్రియార్టీ ఇస్తున్నా. పెళ్లి చేసుకోవాలనే ఆలోచన వచ్చినప్పుడు నేనే స్వయంగా వెల్లడిస్తా” అని పేర్కొన్నాడు.