చంద్రబాబు నాయుడుకి భారీ షాక్‌

చంద్రబాబు నాయుడుకి భారీ షాక్‌

రాష్ట్ర పరిస్థితులపై ఢిల్లీ పెద్దలతో మాట్లాడేందుకు వెళ్లిన చంద్రబాబు నాయుడుకి భారీ షాక్‌ తగిలింది. చంద్రబాబు ఢిల్లీ టూర్‌ అట్టర్‌ ప్లాఫ్‌ అయ్యింది. టీడీపీ అధ్యక్షుడిని కేంద్ర పెద్దలు, జాతీయ మీడియా పట్టించుకోలేదు. రెండు రోజులుగా ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్‌మెంట్ కోసం ప‌డిగాపులుగాస్తున్నప్పటికి చంద్రబాబుకు చుక్కెదురయ్యింది. కశ్మీర్‌ ప‌ర్య‌ట‌న ముగించుకుని, ఢిల్లీకి వ‌చ్చినప్పటికి.. అమిత్‌ షా, చంద్ర‌బాబుకు అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దాంతో మీడియాను పిలిచి కాల‌క్షేపం చేస్తున్నారు చంద్రబాబు.

పార్టీ ప‌రిస్థితి ద‌య‌నీయంగా మార‌డంతో బీజేపీ అండ కోసం ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు చంద్రబాబు. కానీ గతంలో అమిత్‌ షా కుటుంబంతో తిరుమలకు వస్తే.. ఆయన కాన్వాయ్‌పై చంద్రబాబు రాళ్లు వేయించిన ఘటనను బీజేపీ మరచిపోలేదు. అంతేకాక నరేంద్ర మోదీని ఉగ్రవాది అని సంభోదించిడాన్ని కూడా కాషాయ నేతలు ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. రెండున్న‌రేళ్ల‌యినా చంద్ర‌బాబు కుట్ర‌ను బీజేపీ పెద్దలు మర్చిపోలేదు.

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌భుత్వాన్ని ఉగ్ర‌వాదం అంటున్న‌ చంద్ర‌బాబు క‌ల్ల‌బొల్లి క‌బుర్లను బీజేపీ, జాతీయ మీడియా పట్టించుకోవడం లేదు. ఏపీ డ్ర‌గ్స్‌కు అడ్డాగా మారుతోందని రాష్ట్ర ప్ర‌తిష్ట‌ను మ‌స‌క‌బార్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు చంద్రబాబు. ఢిల్లీలో ఉన్న చంద్ర‌బాబును క‌ల‌వాల‌ని టీడీపీ నేతలు జాతీయ మీడియాకు ప‌దే ప‌దే ఫోన్లు చేస్తున్నారు. అయినప్పటికి వారు బాబును పెద్దగా పట్టించుకోవడం లేదు.

ఇటు కేంద్ర పెద్దల అపాయింట్‌మెంట్‌ దొర‌క్క‌, అటు జాతీయ మీడియా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో చంద్రబాబు వెనుదిరిగారు. ఆర్టిక‌ల్ 356 అంటూ హ‌డావిడి చేద్దామ‌నుకున్న చంద్ర‌బాబు వ్యూహం తుస్సుమనడమే కాక జాతీయ స్థాయిలోనూ ఆయన ప్రతిష్ట ఎంతలా దిగజారిందో మరోసారి బహిర్గతం అయ్యింది.