Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ తన ప్రసంగాల్లో ఎప్పుడూ పొరపాట్లు చేస్తుంటారు. ఒక మాట అనబోయి మరొకటి అనేసి నవ్వుల పాలవుతుంటారు. సోషల్ మీడియాలో రాహుల్ ప్రసంగాలపై నెటిజన్లు తెగ సెటైర్లు వేస్తుంటారు. అమెరికా పర్యటనలో లోక్ సభ స్థానాల సంఖ్యను 545కు బదులుగా 546 అని చెప్పడం, ఉత్తర్ ప్రదేశ్ లో రైతులను ఉద్దేశిస్తూ మామిడిపండ్లు తయారుచేసే యంత్రాలు అనడం, నిత్యావసరాల ధరల పెరుగుదలలో లెక్కలు తప్పుగా చూపడం వంటి పొరాపట్లు చేసి ఇటీవలి కాలంలో తరచుగా నెటిజన్లకు దొరికిపోయి విమర్శల పాలయ్యారు రాహుల్. నెటిజన్లే కాదు..బీజేపీ నేతలూ రాహుల్ మాటలను ఎత్తిచూపుతూ తెగ విమర్శలు చేస్తూ వ్యంగాస్త్రాలు సంధిస్తుంటారు. కొన్నినెలలుగా ఇదే జరుగుతోంది. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ఆ రాష్ట్రంలో నిర్వహించే ప్రచారంలో కూడా రాహుల్ ఇలాంటి తప్పులేవైనా చేస్తే వాటిపై విమర్శలు గుప్పించేందుకు బీజేపీ సోషల్ మీడియా టీమ్ కాచుక్కూచింది. కానీ వారికి షాక్ తగిలింది. టంగ్ స్లిప్ అవడంలో రాహుల్ స్థానంలోకి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వచ్చిచేరారు. కర్నాటక ఎన్నికలను బీజేపీ ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుందో ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. సర్వశక్తులూ ఒడ్డయినా సరే..కర్నాటకంలో గెలుపొందితీరాలని బీజేపీ కంకణం కట్టుకుంది.
అమిత్ షా స్వయంగా కర్నాటకలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. తన ప్రసంగాల విషయంలో, మీడియాతో మాట్లాడే సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే అమిత్ షా కర్నాటక ఎన్నికల ఒత్తిడో, మరే కారణమో కానీ..తప్పులు చేస్తూ దొరికిపోతున్నారు. రెండు రోజుల క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో అవినీతి పోటీ జరిగితే…యడ్యూర్ప ప్రభుత్వమే విజేతగా నిలుస్తుంది అని వ్యాఖ్యానించారు. దీంతో అక్కడున్న స్థానిక బీజేపీ నేతలతో పాటు..మీడియా ప్రతినిధులు కూడా షాక్ తిన్నారు. వెంటనే తేరుకున్న నాయకులు యడ్యూరప్ప కాదు…సిద్ధరామయ్య అని సర్దిచెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ అమిత్ షా వ్యాఖ్య సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాంగ్రెస్ శిబిరం..అమిత్ షా వ్యాఖ్యలను ఉదహరిస్తూ రకరకాల కామెంట్లు పోస్ట్ చేసింది. ఈ గొడవ ఇంకా సద్దుమణగకముందే అమిత్ షా ప్రసంగం అనువాదంలో తప్పు దొర్లింది. దేవనగిరి జిల్లా చల్లకెరెలో చేపట్టిన ర్యాలీలో అమిత్ షా మాట్లాడుతూ సిద్ధరామయ్య ప్రభుత్వం కర్నాటకను అభివృద్ధి చేయలేదు. ప్రధాని మోడీ పై నమ్మకముంటే యడ్యూరప్పకే ఓటేయండి.
దేశంలోనే అత్యుత్తమ రాష్ట్రంగా కర్నాటకను తీర్చిదిద్దుతాం అని పిలుపునిచ్చారు. ఆయన ప్రసంగాన్ని కన్నడలో తర్జుమాచేసిన ప్రహ్లాద్ జోషి దళితులకూ, పేదలకూ, వెనుకబడిన వర్గాల వారికీ ప్రధాని మోడీ ఏమీ చేయరు. ఆయన దేశాన్ని నాశనంచేసేస్తారు. దయచేసి ఆయనకే ఓటేయండి అని తీవ్ర పొరపాటు వ్యాఖ్యలు చేశారు. ప్రహ్లాద్ జోషి మాటలువిని అక్కడున్న నేతలు, ప్రజలు అవాక్కయ్యారు. తర్వాత ప్రహ్లాద్ జోషి తప్పు సరిచేసుకున్నప్పటికీ..అధికార పార్టీ జాతీయ అధ్యక్షుడి సభలో ఇలాంటి తప్పులు దొర్లడం…కాంగ్రెస్ కు అనుకోని వరంగా మారింది. ఈ మాటలను వ్యంగాస్త్రాలుగా మలుస్తూ కాంగ్రెస్ సోషల్ మీడియా విభాగం బీజేపీపై విరుచుకుపడుతోంది. మొత్తానికి గెలవాలన్న ఒత్తిడి, గెలవలేమేమోనన్న భయం అమిత్ షా వంటి నేతను కూడా ఉక్కిరిబిక్కిరి చేసేస్తోందన్నమాట.