సినిమాగా రానున్న అమృత ప్రణయ్‌ల ప్రేమకథ

సినిమాగా రానున్న అమృత ప్రణయ్‌ల ప్రేమకథ

మిర్యాల గూడ ప్రాంతానికి చెందిన అమృత.. ప్రణయ్‌ని ప్రేమించి పెళ్లిచేసుకోవడంతో తన కులం వాడు కాదన్న కారణంతో పాటు ఆస్తి, అంతస్తులు సరితూగకపోవడంతో ప్రణయ్‌ని హత్య చేయించారు మారుతీరావు. నిండు గర్భిణిగా ఉన్న కూతురు అమృత కళ్ల ముందే అత్యంత దారుణంగా కిరాయి హంతకులు ప్రణయ్‌ని నరికిచంపారు. ఈ కేసులో ఏ1 నిందితుడిగా ఉన్న మారుతీరావు జైలుకి వెళ్లి ఇటీవలే బెయిల్‌పై తిరిగి వచ్చారు. అమృత మగబిడ్డకు జన్మనిచ్చి అత్తింట్లోనే ఉంటుంది.

మొత్తానికి ఒక ప్రేమ కారణంగా రెండు కుటుంబాలు దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాయి. భర్తను తండ్రిని పోగొట్టుకుని అమృత వేదన అనుభవిస్తుండగా.. కూతురి మీద ప్రేమతో పరువు ప్రతీకారాలతో ఉక్కిరి బిక్కిరి అవుతూ ప్రాణాలను బలితీసుకున్నాడు మారుతీరావు. అయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ సంచలనంగా మారిన అమృత, ప్రణయ్‌‌ ప్రేమకథపై రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మ గారి మనవడు’ విడుదలకు సిద్ధమైంది. అమృత, ప్రణయ్‌‌ ప్రేమకథ స్పూర్తితో నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో మాస్టర్ రవితేజ లీడ్ రోల్ ప్లే చేస్తున్నారు.

సీనియర్ నటీమణులు జమున, అన్నపూర్ణలు కీలకపాత్రల్లో నటిస్తుండగా.. బాలాదిత్య, అర్చన కీ రోల్స్ ప్లే చేశారు. ఈ సందర్భంగా ఈ చిత్రం గురించి నటుడు బాలాదిత్య పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ చిత్రంలో తనకు జోడీగా అర్చన నటిస్తుందని.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు తమ పాత్రల్ని ఎంతో హార్ట్ టచ్చింగ్‌ అండ్ ఎమోషనల్‌గా తీర్చిదిద్దారన్నారు. తమ పాత్రల నిడివి తక్కువే అయినా సినిమాలో హైలైట్‌గా ఉంటుందంటున్నారు. వాస్తవిక కథలో తెరకెక్కిన ఈ చిత్రంలో ప్రణయ్ పాత్ర చేయడం కోసం చాలా రీసెర్చ్ చేశానన్నారు బాలాదిత్య. ఏప్రిల్ నెలలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తుందని అన్నారు నటుడు బాలాదిత్య.