ఏపీలో ఎన్నికలు దగ్గరకి వస్తున్న వేళ పార్టీలలోకి చేరికలు, జుంపింగ్ లు మొదలయ్యాయి. అధికశాతం టీడీపీ వైపు చూస్తుండగా అందులో చేరినా టికెట్ హామీ రాలేదని భావించినవారు మాత్రం వైసీపీ వంక చూస్తున్నారు. అదే కోవలో ఇప్పుడు జగన్ పార్టీలో చేరేందుకు ఏపీ మాజీ సీఎం కుమారుడు సిద్ధం అయ్యాడు. ఏపీ మాజీ సీఎం నేదురుమల్లి జనార్ధనరెడ్డి కుమారుడు రాంకుమార్ రెడ్డి వైసీపీలో చేరిక ఖరారయ్యింది.
నిన్న పాదయాత్రలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా పిఠాపురంలో పర్యటిస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రాంకుమార్ రెడ్డి కలిశారు. ఈ సందర్భంగా ఆయన జగన్తో తాజా రాజకీయాలపై చర్చించారు. అయితే వెంకటగిరి టికెట్ను ఆశిస్తున్న నేదురుమల్లి.. ఆ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారు. అయితే, ఇప్పటికే వెంకటగిరి స్థానంపై మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డికి జగన్ హామీ ఇచ్చినట్టు సమాచారం.
మరో ఆసక్తికర అంశం ఏంటంటే రాంకుమార్ రెడ్డిని రాష్ట్ర కార్యదర్శిగా శనివారమే బీజేపీ ప్రకటించింది. నేదురుమల్లి ఆగస్టులో వైసీపీలో చేరుతారని కొన్నాళ్లుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ను నేదురుమల్లి కలవడంతో ప్రాధాన్యం సంతరించుకుంది. వెంకటగిరి టికెట్ను రామ్ నారాయణ రెడ్డికి ఇస్తారా రామ్కుమార్ రెడ్డికి ఇస్తారా అనే దానిపై పార్టీ వర్గాల్లో సర్వత్రా ఆసక్తి నెలకొంది.