ఏపీ ప్రజలపై భారీ పన్నుభారం

ఏపీ ప్రజలపై భారీ పన్నుభారం

ఏపీలో ఆస్తి పన్ను, చెత్త సేకరణ పన్నులపై జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రజా సంఘాలు, ప్రజలు ఎన్ని ఆందోళనలు చేసినా, ప్రతిపక్షాలు అభ్యంతరాలు చెప్పినా వెనక్కు తగ్గలేదు. కొత్త విధానం ప్రకారం అన్ని పట్టణ స్థానిక సంస్థల్లోనూ ఈ రెండు ప్రతిపాదనలనూ ఆమోదిస్తూ అధికార పార్టీ సభ్యులు తీర్మానాలు చేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యుల అభ్యంతరాలు, సవరణ తీర్మానాలు చర్చకు కూడా రావడం లేదనే విమర్శలు వినపిస్తున్నాయి. గత వారం, పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో నిర్వహించిన ప్రత్యేక సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటున్నారు.

కొత్త విధానం ప్రకారం పట్టణ, నగర ప్రజలపై ఆస్తి పన్ను భారం రూ.186 కోట్లు, చెత్తపై రుసుముల భారం ఏటా రూ.240 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంటే ఏటా రూ.426 కోట్ల అదనపు భారం పడనుంది. పాలకవర్గ తీర్మానాలతో ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి మూల ధన విలువ ఆధారంగా ఆస్తి పన్ను వసూళ్లకు, త్వరలో అన్ని పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో చెత్త సేకరణపై పూర్తి స్థాయిలో రుసుముల విధింపునకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

కొత్త పన్నులు రూ.188 కోట్లు పెరుగుతాయని ప్రభుత్వం చెబుతున్నా, అసెన్‌మెంట్ల వారీగా ప్రజలకు ప్రత్యేక నోటీసులిస్తే వాస్తవం ఏమిటో తేలుతుందని ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు. పట్టణ స్టానిక సంస్థల పరిధిలో 40 లక్షల నివాసాలు, వాణిజ్య సంస్థలు ఉన్నట్లు స్వచ్ఛాంధ్ర సంస్థ లెక్కలు చెబుతున్నాయి. చెత్త సేకరణపై సగటున నెలకు రూ.50 చొప్పున వసూలు చేసినా రూ.20 కోట్లు వస్తుంది. అంటే ఏడాదికి 240 కోట్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.