తాత్కాలిక జైలుగా ఆ పాఠశాల

తాత్కాలిక జైలుగా ఆ పాఠశాల

నవంబర్ 4 అరెస్టైన రిపబ్లిక్‌ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నాబ్‌ గోస్వామి గత రాత్రి ఓ పాఠశాలలో గడిపారు. మహారాష్ట్రలోని అలీభాగ్‌లో ఉన్న ఆ పాఠశాలను ప్రస్తుతం తాత్కాలిక జైలుగా వినియోగిస్తున్నారు. ఖైదీలను, విచారణ ఖైదీలను ప్రధాన జైలుకు పంపే ముందు మందు జాగ్రత్త చర్యగా ఇక్కడ 14 రోజుల పాటు క్వారంటైన్‌‌లో ఉంచుతున్నారు. ఇందులో భాగంగానే అర్నాబ్‌ను కూడా ఇక్కడ ఉంచినట్లు అధికారులు తెలిపారు.

అలీభాగ్‌ పాఠశాల (తాత్కాలిక జైలు)లో ప్రస్తుతం 99 మంది ఖైదీలున్నారు. దీని మొత్తం సామర్థ్యం 82 మందికే కాగా, అదనంగా 17 మంది ఖైదీలను ఉంచారు. ఈ ఏడాది మే నెలలో అలీభాగ్‌ జైళ్లో 158 మంది ఖైదీలకు, ఆర్థర్‌ జైలులో 28 మంది ఖైదీలకు కరోనా వైరస్ సోకింది. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు.

మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జైళ్ల శాఖ అధికారులు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలోని 23 నగరాల్లో 30కి పైగా తాత్కాలిక జైళ్లను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలలు, హాస్టళ్లు, కాలేజీలను ఇందుకోసం ఉపయోగిస్తున్నారు. 14 రోజుల పాటు క్వారంటైన్‌‌లో ఉంచిన అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత సాధారణ జైళ్లకు తరలిస్తున్నారు. ఈ తాత్కాలిక జైళ్ల వద్ద పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.

2018 నాటి ఇంటీరియర్ డిజైనర్ అన్వయ్ నాయక్‌ ఆత్మహత్య కేసులో అర్నాబ్ గోస్వామిని మహారాష్ట్ర పోలీసులు అరెస్టు చేశారు. రిపబ్లిక్ టీవీ బకాయిలు చెల్లించలేదన్న కారణంగా అన్వయ్ నాయక్, ఆయన తల్లి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించారంటూ అర్నాబ్ సహా మరో ఇద్దరిపై ఐపీసీ సెక్షన్ 304 , సెక్షన్ 34 తదితర సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

అర్నాబ్ సహా మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేసిన ముంబై పోలీసులు మహారాష్ట్రలోని రాయ్‌గఢ్ జిల్లాలోని అలీబాగ్‌ కోర్టులో ప్రవేశపెట్టారు. న్యాయస్థానం వీరికి నవంబర్ 18 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. 14 రోజుల పాటు అర్నాబ్‌ను తమ కస్టడీకి అప్పగించాలంటూ పోలీసులు అభ్యర్థించగా.. కోర్టు అందుకు నిరాకరించింది. కస్టోడియల్ విచారణ అవసరం లేదంటూ జ్యుడీషియల్ రిమాండ్‌ విధించింది.