అజీమ్ ప్రేమ్‌జీ ప్రశంస

అజీమ్ ప్రేమ్‌జీ ప్రశంస

రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో రూ.300 కోట్లతో ఏర్పాటు చేయనున్న విప్రో కన్జ్యూమర్ కేర్ ఫ్యాక్టరీ యూనిట్‌ ప్రారంభోత్సావానికి విచ్చేసిన విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ తెలంగాణ ప్రభుత్వంపై ప్రశంసలు కురిపించారు. కంపెనీలకు పాజిటివ్ దృక్పథంతో తెలంగాణ సర్కార్ స్వాగతం చెబుతోందని.. రానున్న రోజుల్లో మరిన్ని పెట్టుబడులు పెడతామన్నారు. కంపెనీలు రావడం వల్ల స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. కంపెనీ యూనిట్‌ను మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు.

అజీమ్ ప్రేమ్‌జీ వంటి వ్యక్తి మన మధ్య ఉండడం నిజంగా అదృష్టమని మంత్రి కేటీఆర్ అన్నారు. విప్రో సంస్థ రూ.300 కోట్లతో మహేశ్వరంలో ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభిస్తోందని.. అందులో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వడం అభినందనీయమన్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వ సరళీకృత విధానాలతో 2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులు వచ్చాయని.. సుమారు 16 లక్షల ఉద్యోగాలు వచ్చేలా కార్యాచరణ రూపొందించామన్నారు. ఒక కంపెనీ రావాలంటే చాలా కష్టం ఉంటుందని.. పక్క రాష్ట్రాలకు పోకుండా తెలంగాణకు వచ్చేలా కృషి చేస్తున్నామన్నారు.

కంపెనీలు రావడంతో ఈ ప్రాంతం ఇంకా అభివృద్ధి చెందుతుందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక్కడ ఏర్పాటయ్యే కంపెనీల్లో 90 శాతం ఉద్యోగాలు స్థానికులకే వచ్చేలా ఒప్పందాలు జరిగాయని.. అలా జరిగితేనే స్థానికులకు ఉపయోగం ఉంటుందన్నారు. స్థానిక యువత ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకుని అభివృద్ధి చెందాలని ఆమె ఆకాంక్షించారు.