గచ్చిబౌలిలో విషాదం

గచ్చిబౌలిలో విషాదం

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం చోటు చేసుకుంది. అంజయ్య నగర్ లో తెల్లవారుజామున ఈ హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా ఉన్న టీవీఎస్ షోరూంలో ఆటోమేటిక్ షెట్టర్ లో చుట్టుకుపోయి ఓ బాలుడు చనిపోయాడు. షో రూమ్ కు ఉన్న ఆటోమేటిక్ షెట్టర్ బాలుడి పాలిట యమపాశం అయింది. టీవీఎస్ షోరూం ఉన్న భవనానికి తూర్పుగోదావరికి చెందిన అర్జున్ వాచ్‌మెన్‌గా గా పని చేస్తున్నాడు.

అర్జున్ తన భార్య దేవి, కుమారుడు రాజేష్ (10) లతో కలిసి అక్కడే నివాసం ఉంటున్నాడు. ఇవాళ ఉదయం 7.30 గంటల ప్రాంతంలో టీవీఎస్ షోరూంకు ఉన్న ఆటోమేటిక్ షెట్టర్ తెరుచుకోని, పక్కనే ఉన్న రాజేష్ అందులో ఇరుక్కుపోయాడు. విషయం గమనించిన స్థానికులు షెట్టర్ ను కిందకు దించి రాజేష్ ను బయటకు తీశారు. షెట్టర్ చుట్టేయడంతో తీవ్రగాయాలైన రాజేష్ అక్కడికక్కడే మృతి చెందాడు.

అయితే షోరూం నిర్వాహకులు, భవన యజమానుల నిర్లక్ష్యం కారణంగా తరచూ ఈ ప్రాంతంలో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. గతంలోనూ ఇదే భవనంలో పనిచేసిన వాచ్‌మెన్ కుమార్తెకు విద్యుత్ షాక్ కొట్టడంతో తృటిలో ప్రాణాపాయం తప్పింది. బాలుడి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. షోరూం నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.