బ్రెజిల్ అధ్య‌క్షుడికి మరోసారి క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ

బ్రెజిల్ అధ్య‌క్షుడికి మరోసారి క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ

బ్రెజిల్ అధ్య‌క్షుడు జైర్ బోల్సొనారో (65)కు మరోసారి కూడా క‌రోనా పాజిటివ్‌గా నిర్దారణ అయింది. ఫాలో-అప్ పరీక్షల అనంతరం తాజాగా ఆయనకు మరోసారి పాజిటివ్‌ వచ్చింది. దీంతో ఆయన మరో రెండు వారాలపాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. ఈ రెండు వారాల్లో ఉన్న అన్ని పర్యటనలను ఆయన వాయిదా వేసుకున్నారు. అమెరికా తరువాత ఎక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదయిన దేశాల్లో బ్రెజిల్‌ రెండో స్థానంలో ఉంది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌లాగానే బోల్సోనారో కూడా కరోనాను తేలికగా తీసుకున్నారు. కరోనాను సాధారణంగా వచ్చే ఒక ఫ్లూగా ఆయన అభివర్ణించారు. వైద్య, ఆరోగ్య సంస్థుల సూచించినట్లు ఆయన మాస్క్‌లు ధరించలేదు. సామాజిక దూరం పాటించలేదు. ఆయన పార్టీలోని వారిని కలిసినప్పుడల్లా వారికి షేక్‌ హ్యాండ్స్‌ ఇస్తూ, కౌగిలించుకున్నారు. ఆయనకు జూలై 7 వ తేదీన కరోనా పాజిటివ్‌గా తేలింది. అప్పటి నుంచి ఆయన క్వారంటైన్‌లో ఉన్నారు.

తేలికపాటి లక్షణాలున్నబాధితుల క్లినికల్ రికవరీ సగటు సమయం సుమారు రెండు వారాలు అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అయితే రెండు వారాల తరువాత కూడా ఆయనకు నెగిటివ్‌ రాకపోవడం గమనార‍్హం. ఇప్పుడు పరీక్షించగా మరోసారి కరోనా పాజిటివ్‌గానే వచ్చింది. దీంతో బోల్సొనారో మరో రెండు వారాలపాటు ఐసోలేషన్‌లో ఉండనున్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉండని వైద్యులు తెలిపారు. ప్రెసిడెంట్‌ భవనంలోనే బోల్సొనారోకు వైద్యులు చికిత్సనందిస్తున్నారు. ఇప్పటి వరకు బ్రెజిల్‌లో 2.2 మిలియన్‌ కరోనా కేసులు నమోదు కాగా 80,000 మంది వైరస్‌ బారిన పడి మరణించారు.