బ్రిడ్జి కూలి నుజ్జునుజ్జైన కారు.. ఇద్దరు మృతి

ఉత్తర్ ప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని ఈటాహ్ జిల్లా మలవాన్ ప్రాంతంలో ఈ ఘటన సంభవించింది. జాతీయ రహదారి 91పై మలవాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న వంతెన ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వంతెన కూలినపుడు అటుగా ఓ కారు రావడంతో అది సరిగ్గా వాహనంపైనే పడటంతో ఈ ఘటన జరిగింది. అయితే అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.

అయితే వంతెన ఒక్కసారిగా కూలిపోవడంతో కారు నుజ్జునుజ్జు అయింది. కారులో ఇద్దరి మృతదేహాలను పరీక్ష కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ కు తరలించారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని అధికారులు వెల్లడించారు. వంతెనను నిర్మిస్తున్న కాంట్రాక్టరుపై కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై దర్యాప్తు చేస్తున్నామని ఈటాహ్ జిల్లా కలెక్టరు సుఖ్ లాల్ భారతి వెల్లడించారు. కొత్తగా నిర్మిస్తున్న వంతెన కూలడంతో అటువైపుగా రావాలంటేనే జనం భయభ్రాంతులకు గురౌతున్నారు.