ధర్మాబాద్ కోర్టుకు బాబు లాయర్ల బృందం…

కొద్ది సంవత్సరాల క్రితం  బాబ్లీ ప్రాజెక్టు వద్ద జరిగిన నిరసన ప్రదర్శనల్లో భాగంగా విధుల్లో ఉన్న పోలీసులను అడ్డుకున్నారని, 144 సెక్షన్ అమలులో ఉండగా, దాన్ని అతిక్రమించారని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సహా పద్నాలుగు మంది నేతల మీద నమోదైన కేసులో ఆయన నేడు ధర్మాబాద్ కోర్టుకు హాజరుకావాల్సివుంది. ఈ కేసు విచారణ నేడు ధర్మాబాద్ కోర్టులో సాగనుండగా, చంద్రబాబు సహా 16 మందికి కోర్టుకు హాజరు కావాలని నాన్ బెయిలబుల్ వారెంట్లు జారీ అయ్యాయి.
ఇక నేడు చంద్రబాబు ధర్మాబాద్ కోర్టుకు వెళ్లడం లేదు. ఆయనకు బదులుగా, న్యాయవాదుల బృందం ధర్మాబాద్ కోర్టుకు వెళ్లారు.
కోర్టుకు హాజరయ్యేందుకు తమ క్లయింట్ కు మరింత సమయం కావాలని వారు అడగనున్నట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో వారెంట్ ను రీకాల్ చేయాలని వారు న్యాయమూర్తిని కోరనున్నట్టు అధికార వర్గాలు వెల్లడించాయి. కోర్టు పంపిన నోటీసులు మరాఠీలో ఉండటంతో వాటిని అధ్యయనం చేసేందుకు, తనపై మోపిన అభియోగాలను తెలుసుకునేందుకు చంద్రబాబుకు మరింత సమయం అవసరమని కూడా ధర్మాబాద్ కోర్టులో న్యాయవాదులు తమ వాదనలను వినిపించనున్నారు. తాజాగా రాజ్యసభకు ఎన్నికయిన కనకమేడల రవికుమార్ ఈ బృందానికి నాయకత్వం వహిస్తున్నారు.