పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

పదో తరగతి పరీక్ష ఫలితాలు విడుదల

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) పదో తరగతి పరీక్ష ఫలితాలు మంగళవారం విడుదలయ్యాయి. నేడు మధ్యాహ్నం 12 గంటలకు సీబీఐఎస్‌ఈ బోర్డు అధికారికంగా ఫలితాలను విడుదల చేసింది. ఫలితాల కోసం సీబీఎస్‌ఈ విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్‌ cbseresults.nic.inలో ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. అలాగే విద్యార్థులు cbse.gov.in, cbse.nic.inలో కూడా ఫలితాలను చూసుకోవచ్చని పేర్కొంది. ఫలితాల మార్క్‌ షిట్‌లు, సర్టిఫికేట్‌లను యాక్సెస్‌ చేసుకోవచ్చు. ఇంటర్నల్స్‌, యూనిట్‌ టెస్ట్స్‌, మధ్యంతర పరీక్షలు, ప్రీ-బోర్డ్‌ పరీక్షలలో విద్యార్థుల పనితీరును బట్టి మార్కులు కేటాయించారు.

కాగా పరీక్షలు నిర్వహించకుండా సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు ప్రకటించడం ఇదే తొలిసారి. వాస్తవానికి ఈ ఫలితాలు జులై 20న విడుదల చేయాల్సి ఉంది. అయితే.. స్కూళ్లు మార్కుల జాబితా పంపడంలో ఆలస్యం చేయడంతో ఫలితాల విడుదల కూడా వాయిదా పడింది. ఇక కరోనా మహమ్మారి కారణంగా ఈ ఏడాది కూడా సీబీఎస్‌ఈ 10,12 తరగతి పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల జులై 30న 12వ తరగతి ఫలితాలను సీబీఎస్‌ఈ బోర్డు విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో రికార్డు స్థాయిలో 99.37 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.