Posted [relativedate] at [relativetime time_format=”H:i”]
తనపై దాడిచేయడమంటే రాష్ట్రాన్ని బలహీనపరచడమే అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. తన నివాసంలో నిర్వహించిన టీడీపీ సమన్వయ కమిటీ సమావేశంలో తాజా రాజకీయపరిణామాలు, భవిష్యత్ రాజకీయ కార్యాచరణపై చంద్రబాబు చర్చించారు. రాష్ట్రానికి న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామని, తాము ఎక్కడా తొందరపడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నాలుగేళ్లు ఓపిగ్గా ఎదురుచూశామని… ఈ సమయాన్ని బీజేపీ సద్వినియోగం చేసుకోలేదని మండిపడ్డారు. టీడీపీకి పదవులు ముఖ్యంకాదని, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, ప్రజల హక్కుల సాధనే లక్ష్యమని స్ఫష్టంచేశారు. ఏపీకి అన్యాయం చేయడమే కాకుండా కేంద్రప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తొలి ఏడాదిలోనే ఇవ్వల్సిన లోటు నిధులను ఐదేళ్ల పాటు నాన్చారని, ఇప్పుడు లోటు కింద రూ. 138 కోట్లే ఇస్తామంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తనపై దాడి చేయడానికి చూపిస్తున్న శ్రద్ధలో కొంతయినా ఏపీ అభివృద్ధిపై చూపితే ఈ పరిస్థితి వచ్చేది కాదని వ్యాఖ్యానించారు. అవిశ్వాసం నోటీసులు అనుమతించకుండా మూడు రోజులుగా లోక్ సభలో వాయిదాలు వేస్తున్నారని, వైసీపీ, జనసేన బీజేపీ తరపున మాట్లాడుతున్నాయని ఆరోపించారు. సమస్యను పక్కదారి పట్టించడం, టీడీపీపై బురదజల్లడం ఒక పద్ధతి ప్రకారం చేస్తున్నాయని మండిపడ్డారు. బీజేపీ, వైసీపీ, జనసేన అజెండా ఒక్కటేనని, టీడీపీని బదనాం చేయడమే సింగిల్ పాయింట్ అజెండాగా పెట్టుకున్నాయని ముఖ్యమంత్రి ఆరోపించారు.