కైకాల కుమారుడికి ముఖ్యమంత్రి ఫోన్‌

కైకాల కుమారుడికి ముఖ్యమంత్రి ఫోన్‌

సీనియర్‌ నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బుధవారం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కైకాల కుమారుడికి ఫోన్‌ చేశారు. కైకాల చిన్న కుమారుడు, కేజీఎఫ్ సినిమా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కైకాల రామారావు కు సీఎం జగన్‌ ఫోన్ చేసి.. కైకాల సత్యనారాయణ ఆరోగ్య పరిస్థితి గురించి వాకబు చేశారు.

ప్రభుత్వం తరఫున ఎలాంటి సహాయం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామని సీఎం జగన్‌ తెలిపారు. ప్రస్తుతం కైకాల హైదరాబాద్ అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. అదే విధంగా రాష్ట్ర మంత్రి పేర్ని నాని కూడా కైకాల ఆరోగ్య పరిస్థితి గురించి వారి కుటుంబ సభ్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

సినీ ప్రముఖులు చిరంజీవి, అల్లు అరవింద్, నందమూరి బాలకృష్ణ, మోహన్ బాబు, సీనియర్ నటుడు రావు రమేష్ కన్నడ సూపర్ స్టార్‌ యష్, మరో స్టార్ శివ రాజ్ కుమార్‌లు కైకాల కుమారుడికి ఫోన్ చేసి కైకాల ఆరోగ్యం గురించి వాకబు చేశారు. కైకాలకు ఏమీ కాదని, తామంతా ఉన్నామని సినీ ప్రముఖుల ధైర్యం చెప్పారు. మరోవైపు కైకాల కోలుకుంటున్నారని, ఎలాంటి ఇబ్బంది లేదని, దయచేసి పుకార్లు సృష్టించి ప్రజలను, కైకాల అభిమానులను ఆందోళనకు గురి చేయవద్దని ఆయన కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.